Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన

  • సీఎం విజయ్ కీలక నిర్ణయం
  • ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
  • మారుమూల గ్రామాల్లో కూడా తిరగనున్న బస్సులు
Cmvijay

Cmvijay

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో కొనుగోలు చేసే అన్ని కొత్త ప్రభుత్వ బస్సులు ఎయిర్ కండీషన్డ్ (AC) బస్సులే ఉంటాయని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్థిబన్ వెల్లడించారు. ప్రజలు మరింత సౌకర్యవంతంగా.. ఎక్కువ దూరాలు ప్రయాణించేలా ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నదే సీఎం విజయ్ లక్ష్యమని మంత్రి తెలిపారు.

ఆదివారం సేలంలో అధికార పార్టీ టీవీకే (TVK) నిర్వహించిన కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పార్థిబన్.. తమిళనాడులోని మారుమూల గ్రామాలకు కూడా బస్సు సౌకర్యాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి విజయ్ ఆదేశించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ సౌకర్యంగా ప్రయాణించేందుకు అవసరమైన అన్ని వసతులతో బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం భావిస్తున్నారని వివరించారు.

ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఒక ప్రభుత్వ బస్సులో ప్రయాణించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి.. ఆ ప్రయాణం తర్వాత కొత్తగా కొనుగోలు చేసే ప్రతి ప్రభుత్వ బస్సులో ఎయిర్ కండీషనింగ్ సౌకర్యం ఉండాలని సీఎం సూచించారని తెలిపారు. గత వారం ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రవ్యాప్తంగా 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బస్సు కండక్టర్‌తో మాట్లాడి ప్రయాణికులకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. రూ.127.21 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ 300 బస్సుల్లో 164 డీజిల్ బస్సులు, 136 BS-VI ప్రమాణాలకు అనుగుణమైన సీఎన్‌జీ బస్సులు ఉన్నాయి. వీటిని చెన్నైలోని కోయంబేడు, కిలాంబాక్కం వంటి ప్రధాన బస్ టెర్మినళ్ల నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతూ ప్రయాణికుల రద్దీని తగ్గించడం, అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా రవాణాను ఆధునీకరించడం, రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన అనుసంధానం కల్పించడం, ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.