Talha Saeed: ‘జిహాద్ కొనసాగిస్తాం.. ఢిల్లీ ఎవరిదో మర్చిపోయారా?’.. భారత్‌పై తల్హా సయీద్ విషం

  • భారత్‌పై మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన లష్కర్ ఉగ్రవాది తల్హా సయీద్.
  • బతికున్నంతకాలం జిహాద్ కొనసాగిస్తామని ప్రకటన.
  • భారత ఉపఖండంలో ముస్లింలు 500 ఏళ్లు పాలించారంటూ వ్యాఖ్య.
  • ఢిల్లీ ఎవరిదో మరిచిపోయారా? అంటూ కవ్వించే ప్రయత్నం.
Pakistan

Pakistan

Talha Saeed: లష్కరే తోయిబా (LeT) అధినేత హఫీజ్ సయీద్ కుమారుడు, ఉగ్రవాది తల్హ సయీద్ భారత్‌పై మరోసారి విషంకక్కాడు. భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని 500 ఏళ్ల పాటు ముస్లింలు పాలించారని ప్రస్తావించిన లష్కర్ ఉగ్రవాది.. ఢిల్లీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌పై ప్రశంసలు కురిపించారు.

ఇటీవల పాకిస్తాన్‌లోని షేక్ పురాలో ఒక కార్యక్రమంలో తల్హా సయీద్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే భారత్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ఉద్దేశిస్తూ.. ఢిల్లీ ఎవరిదో, ఈ ప్రాంతాలన్నీ ఎవరివో చరిత్ర మరిచిపోయారా? అంటూ ముస్లిం పాలనను ఎత్తిచూపాడు. తాము బతికున్నంత కాలం జిహాద్ కొనసాగిస్తామని స్పష్టం చేశాడు. తాము జిహాద్‌కు ప్రతిజ్ఞ చేసినవారమని, తమలో శక్తి ఉన్నంతవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నాడు.

పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ గురించి మాట్లాడుతూ.. మునీర్ ఖురాన్‌ను కంఠస్థం చేసిన వ్యక్తి అని, ఆయన విశ్వాసం, భక్తి, జిహాద్ వంటి భావనలను తిరిగి ముందు తెచ్చారని ప్రశంసించారు. మునీర్‌ను పాకిస్తాన్‌కు లభించిన అదృష్టంగా అభివర్ణించాడు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధం గురించి చాలా స్పష్టమవుతోంది. తల్హా సయీద్‌ను అమెరికా, భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతడు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక వ్యక్తిగా పనిచేస్తున్నాడు. అమెరికా 2012లో అతడిని ఉగ్రవాదిగా గుర్తించగా, భారత్ 2022లో UAPA కింద వ్యక్తిగత ఉగ్రవాదిగా ప్రకటించింది. LeTను ఐక్యరాజ్యసమితి కూడా ఉగ్రవాద సంస్థగా జాబితా చేసింది.