Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన

  • ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై
  • రాజీనామా చేసినట్లు ప్రకటన
  • ఆప్‌ను వీడిన ఏడుగురు ఎంపీలు
Swati Maliwal

Swati Maliwal

ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌ను కుదిపేస్తున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌పై వ్యక్తిగత కార్యదర్శి దాడి చేశాడు. అప్పట్లో పెను దుమారం రేపింది. అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీపై తిరుగుబావుటా ఎగరేసింది. కాషాయ గూటికి చేరింది.

తాజాగా 10 మంది ఆప్ రాజ్యసభ ఎంపీల్లో ఏడుగురు తిరుగుబావుటా ఎగరేశారు. ఏడుగురు ఎంపీలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. ముగ్గురు స్వయంగా కలవగా.. మరో నలుగురు కూడా చేరుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో మండు వేసవిలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలినట్లైంది. అన్హరత వేటు తప్పించుకునేందుకు 2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. ఇది ఆప్‌కు ఊహించని షాక్ తగిలినట్లైంది.

శుక్రవారం రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్ బీజేపీ నేతలను కలవగా.. వారితో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కూడా బీజేపీ గూటికి చేరుతున్నారు.

అశోక్ మిట్టల్..
అశోక్ మిట్టల్.. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తే తన బంగ్లాలో ఉండాలని అశోక్ మిట్టల్ ఆహ్వానించారు. దీంతో ఏడాది పాటు కేజ్రీవాల్.. అశోక్ మిట్టల్ నివాసంలోనే ఉన్నారు. కానీ ఈ స్థాయిలో వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు. ఒకప్పుడు కేజ్రీవాల్ పట్ల విధేయత చూపించిన వాళ్లే.. ఇప్పుడు ద్రోహులుగా మారిపోయారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాకు ఆప్ షాకిచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దా‌ను తప్పించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను కూడా పంపింది. అంతగా అశోక్ మిట్టల్‌ను కేజ్రీవాల్ నమ్మారు. కానీ అతడే వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు.

స్వాతి మాలివాల్..
బీజేపీలో చేరడంపై రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మాట్లాడుతూ.. ‘‘.స్వాతి మాలివాల్ ఎవరికీ భయపడరని యావత్ దేశానికి తెలుసు. దేశంలో ఏ సంస్థ కూడా నన్ను భయపెట్టలేదు. ఇప్పటివరకు అరవింద్ కేజ్రీవాల్‌తో ఏ మంచి వ్యక్తి కూడా కలిసి ఉండలేదు. తానే అవినీతిలో కూరుకుపోయి, ఇతరులపై ఎలా ఆరోపణలు చేయగలడు? రెండేళ్ల క్రితం నాకు ఏమైందో.. నన్ను ఎలా కొట్టారో యావత్ దేశానికి తెలుసు. దానివల్లే వారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఢిల్లీ ప్రజలు నన్ను ప్రేమించడం, మహిళల పట్ల అగౌరవాన్ని ఎన్నటికీ సహించకపోవడం వల్లే వారు ఓడిపోయారు. పార్టీ ప్రస్తుత పరిస్థితికి బయటి వారెవరూ బాధ్యులు కారు. అరవింద్ కేజ్రీవాల్‌తో ఎవరూ కలిసి పనిచేయాలనుకోవడం లేదు..’’ అని అన్నారు.