Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్‌లో రాజకీయాల్లో కొత్త రచ్చ!

  • ‘బెంగాల్ గూర్ఖా ఫోర్స్’ పునరుద్ధరణ..
  • సీఎం కీలక నిర్ణయం
Suvendu Adhikari

Suvendu Adhikari

Suvendu Adhikari: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని నూతన బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన చారిత్రాత్మక పారామిలట్రీ దళం ‘ఈస్టర్న్ ఫ్రంటియర్ రైఫిల్స్’ (EFR) పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది. డార్జీలింగ్ కొండ ప్రాంత పర్యటనలో భాగంగా కుర్సియాంగ్‌లో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. EFR లోకి 1,000 మందికి పైగా గూర్ఖా యువకులను రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో 30 శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఉత్తర బెంగాల్‌లోని గూర్ఖా సామాజిక వర్గానికి EFR కేవలం ఒక రక్షక దళం మాత్రమే కాదు, వారి ఆత్మగౌరవానికి, దేశభక్తికి ప్రతీక. బ్రిటీష్ కాలం (1907) నాటి ఈ సాయుధ బలగం.. ప్రపంచ యుద్ధాలతో పాటు 1962 చైనా యుద్ధం, 1965, 1971 పాకిస్థాన్ యుద్ధాల్లో, నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించింది. సాంప్రదాయ గూర్ఖా కత్తి ‘ఖుక్రీ’ని తమ చిహ్నంగా కలిగిన ఈ దళంతో ఉత్తర బెంగాల్‌లోని ప్రతి గూర్ఖా కుటుంబానికి దశాబ్దాల అనుబంధం ఉంది. విభజన సమయంలో ఈ దళంలోని ఒక భాగం పాకిస్థాన్‌కు వెళ్లగా.. అదే తర్వాతి కాలంలో ‘బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్’ (BGB) గా రూపాంతరం చెందడం దీని విశిష్టత.

మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు..

ఈ చారిత్రాత్మక దళాన్ని గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయాలని చూసిందని డార్జీలింగ్ బీజేపీ ఎంపీ రాజు బిస్తా గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. 2010 నుంచి ఇందులో ఎలాంటి కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో దాదాపు 2,000కు పైగా పోస్టులు ఖాళీగా ఉండిపోయాయని, పైగా ఉన్న మూడు బెటాలియన్లను రెండుగా కుదించి మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ దళాన్ని “చంపేయడానికి” ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను కొట్టిపారేసిన టీఎంసీ.. తాము కొండ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేశామని పేర్కొంది. పశ్చిమ మిడ్నాపూర్‌లోని సాల్వా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న EFR ను సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CAPF) గా మార్చాలనే డిమాండ్ కూడా స్థానికంగా ఉంది. ఈ నేపథ్యంలో, అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈ రిక్రూట్మెంట్ ప్రకటించడం గూర్ఖా సామాజిక వర్గంలో హర్షాతిరేకాలను నింపింది. అసెంబ్లీ ఎన్నికల విజయం తర్వాత గూర్ఖాలతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి బీజేపీ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్.. బెంగాల్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

×
×
Ad