Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..

  • పహల్గామ్ ఉగ్రదాడిపై రేపు సుప్రీంకోర్టులో విచారణ..
  • భద్రతను పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్..
Supreme Court

Supreme Court

Supreme Court: జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలైంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది.

Read Also: Shahid Afridi: షాహిద్ అఫ్రీది యూట్యూబ్ ఛానెల్‌‌పై నిషేధం..

జమ్మూ కాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో పౌరుల భద్రతను నిర్ధారించడానికి ఒక ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లను ఆదేశించాలని ఈ పిటిషన్‌లో కోరారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలకు కనీస భద్రతా ప్రమాణాలు ఉండేటా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని స్థానిక నివాసి జునైద్ మొహమ్మద్ జునైద్, ఇద్దరు న్యాయవాదులు ఫతేష్ కుమార్ సాహు, విక్కీ కుమార్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.

సమాజంలోని సామరస్యం మరియు శాంతిని దృష్టిలో ఉంచుకుని, “నిష్పాక్షికమైన మరియు నిజమైన” నివేదికను మాత్రమే అనుమతించేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆదేశించాలని కూడా పిల్‌లో సుప్రీంకోర్టును కోరారు. దాడిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయాలని పిటిషన్‌దారులు కోరారు.