Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న వీధి కుక్కల దాడి కేసులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. రోడ్లపై తిరిగే వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. గత 2025 నాటి పాత ఉత్తర్వులే అమలులో ఉంటాయని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దాఖలు చేసిన అన్ని దరఖాస్తులను కోర్టు కొట్టివేసింది.
“ఇది ప్రజారోగ్యం – ప్రజల భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. దేశంలో వీధి కుక్కల దాడులు, రేబీస్ వ్యాధి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళనకరం. అన్ని రాష్ట్రాలు కచ్చితంగా యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలను పాటించాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలు ఇవే..
గతేడాది (2025) ఆగస్టులో జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన బెంచ్ ఢిల్లీ – ఎన్సీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై తిరిగే వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోమ్లకు తరలించాలని, వాటికి నసర్గీకరణ, టీకాలు వేసిన తర్వాత మళ్లీ రోడ్లపైకి వదలకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను అడ్డుకునే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అనంతరం నవంబర్ 2025లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, నేషనల్ హైవే అథారిటీలను ఆదేశిస్తూ.. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఆట స్థలాల వంటి పబ్లిక్ ఏరియాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని చెప్పింది. విద్యా, ఆరోగ్య సంస్థల చుట్టూ కుక్కలు లోపలికి రాకుండా ప్రహరీ గోడలు నిర్మించాలని, పట్టుకున్న కుక్కలను మళ్లీ అక్కడ వదలకూడదని స్పష్టం చేసింది. అమాయక పిల్లలపై జరుగుతున్న దాడులు, రేబీస్ కేసులను చూసి ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన సుప్రీంకోర్టు తీర్పు
ఈ వివాదానికి సంబంధించి అన్ని పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, జనవరి 29న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోవడంతో.. ప్రజల రక్షణ కోసం కఠినమైన గైడ్లైన్స్ రూపొందించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు విషయంలో పెద్ద చర్చే నడిచింది. ఒకవైపు సాధారణ ప్రజల భద్రత, మున్సిపల్ కార్పొరేషన్ల బాధ్యతలపై వాదనలు జరగ్గా.. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తలు మూగజీవాలపై క్రూరత్వం చూపించకూడదని, కేవలం నిబంధనల ప్రకారం నసర్గీకరణ మాత్రమే చేయాలని వాదించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తాజా తీర్పు.. భవిష్యత్తులో వీధి కుక్కల సమస్యను అరికట్టడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుండటంతో దేశవ్యాప్తంగా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
