Samay Raina: నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్.. రూ.10 లక్షల జరిమానా

  • నటుడు సమయ్ రైనాకు సుప్రీంకోర్టు షాక్
  • రూ.10 లక్షల జరిమానా విధింపు
  • స్టాండ్‌అప్ కమెడియన్ ప్రవర్తనపై ఆక్షేపణ
Samay Raina

Samay Raina

ప్రముఖ స్టాండ్‌అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనాకు సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇండియాస్ గాట్ లేటెంట్(Indias Got Latent) వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ముందు తప్పుడు వివరాలు సమర్పించారని, గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆయనపై రూ.10 లక్షల జరిమానా విధించింది. రెండు వారాల్లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తూ, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘‘మీరు కోర్టును తప్పుదోవ పట్టించారు’’ అంటూ సమయ్ రైనాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇండియాస్ గాట్ లేటెంట్ తొలి సీజన్‌లో చేసిన వ్యాఖ్యలపై నమోదైన వివాదానికి సంబంధించి సమయ్ రైనా, రన్‌వీర్ అల్లాహాబాద్యా, ఆశిష్ చంచలానీ, అలాగే క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కలిసి విచారించింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ మాట్లాడుతూ.. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం సమయ్ రైనా క్యూర్ ఎస్‌ఎంఏ ఫౌండేషన్ లేదా స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)తో బాధపడుతున్న బాధితులను సంప్రదించాల్సి ఉందని, కానీ ఇప్పటి వరకు ఆ పని చేయలేదని కోర్టుకు తెలిపారు. ‘‘సమయ్ రైనా స్టేజ్ షోలు చేస్తూ తిరుగుతున్నారు. కానీ ఎస్‌ఎంఏ ఫౌండేషన్‌ను సంప్రదించలేదు. ఇలాంటి వ్యక్తిని యువత ఆదర్శంగా భావించడం బాధాకరం’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘నిమ్మకాయ-మిర్చి’ వ్యాఖ్యలపై..

కేంద్ర ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సమయ్ రైనా ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల తన కొత్త షోలో సమయ్ రైనా నిమ్మకాయ-మిర్చి వేలాడదీస్తూ కోర్టు కేసును పరోక్షంగా ఎద్దేవా చేసినట్లు కనిపించిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సమయ్ రైనా నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా, కోర్టు విచారణను ఉద్దేశించినట్లే ఆ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. సమయ్ రైనా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎస్‌ఎంఏ ఫౌండేషన్‌ను సంప్రదించకపోవడం ఉద్దేశపూర్వకంగా జరగలేదని, కోర్టు ఆదేశాలను పాటించేలా సమయ్ రైనాను ఒప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాల్లో ఉంటే భారత చట్టాల నుంచి తప్పించుకోవచ్చని కొందరు భావిస్తున్నారని, అలాంటి ఆలోచన సరికాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా వివాదాల మధ్యే సమయ్ రైనా ఇండియాస్ గాట్ లేటెంట్ రెండో సీజన్‌ను ప్రారంభించారు. కొత్త ఎపిసోడ్‌లు ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ప్రసారమవుతున్నాయి. అయితే తాజా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.