NTV Telugu Site icon

Neet-PG 2021: ప్రత్యేక కౌన్సెలింగ్ కోరుతూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత

Supreme Min

Supreme Min

నీట్‌-పీజీ 2021 కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్‌ కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేస్తే.. ప్రస్తుత ఏడాదిపై ప్రభావం పడుతుందన్న కేంద్రం వివరణతో ఏకీభవిస్తున్నామన్న ధర్మాసనం.. పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైద్య విద్యలో రాజీ పడలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మిగిలిపోయిన 1,456 సీట్లకు మరో రౌండ్‌ ప్రత్యేక స్ట్రే కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్న పిటిషన్లపై.. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ ధర్మాసనం 3 రోజుల పాటు విచారణ జరిపింది. పీజీ కౌన్సెలింగ్‌లో ఏటా భారీగా సీట్లు మిగలడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. దీనిపై 24 గంటల్లో ప్రమాణపత్రం దాఖలు చేయమని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన కొవిడ్ కేసులు, మరణాలు

ఈ మేరకు మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ, కేంద్రం గురువారం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాయి. మిగిలిపోయిన సీట్లలో ఎక్కువ నాన్‌ క్లినికల్‌ విభాగానికి చెందినవేనని.. వీటికి దరఖాస్తులు రావడం లేదని ఎంసీసీ చెప్పింది. 2021లో మిగిలిన సీట్లలో 900 మాత్రమే ఎంపిక చేసుకున్నారని.. కానీ తర్వాత విద్యార్థులు వాటిలో అడ్మిషన్‌ తీసుకోలేదని తెలిపింది. పీజీ 2021 కోర్సు ప్రారంభమై ఏడాదిన్నర అవుతోందని, ఇప్పుడు ఈ సీట్లకు మళ్లీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే.. విద్యార్థుల చదువులు ప్రభావితమవుతాయని న్యాయస్థానానికి వివరించింది. కేంద్రం, ఎంసీసీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం నిన్న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఇవాళ ఆ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. వైద్య విద్య, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రత్యేక స్ట్రే రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించకూడదని ఎంసీసీ , కేంద్రం నిర్ణయం తీసుకుందని సుప్రీం కోర్టు తెలిపింది.