Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన

  • 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
  • 2027 నుంచి అమలు చేయాలని సీబీఎస్‌ఈకి ఆదేశం
  • విద్యార్థులపై ఒత్తిడి పెట్టొద్దని సూచన
Supremecourt

Supremecourt

దేశంలో త్రిభాషా విధానంపై రగడ నడుస్తోంది. కొన్ని రాష్ట్రాలు స్వాగతిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు భాషల విధానం అమలుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌కు సుప్రీంకోర్టు కీలక సూచన చేసింది. ప్రస్తుతం 6వ తరగతి విద్యార్థులకు అమలు చేయాలని ప్రతిపాదించిన మూడు భాషల విధానాన్ని మరో ఏడాది వాయిదా వేసి.. 2027 నుంచి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని గురువారం (సెప్టెంబర్ 17) న్యాయస్థానం సూచించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు కొత్త విధానానికి అలవాటు పడేందుకు ఈ వెసులుబాటు ఉపయోగపడుతుందని జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ సూచించారు. ఈ సూచనపై CBSE తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. కోర్టు సూచనను పరిశీలిస్తామని తెలిపారు. ఈ అంశంపై పునరాలోచన చేసి తాజా నోట్‌తో కోర్టుకు వస్తామని CBSE వెల్లడించింది.

ఏడాది వాయిదా వేయాలని సూచన

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. కొత్త మూడు భాషల విధానాన్ని 6వ తరగతి విద్యార్థులకు 2027 నుంచి అమలు చేసే విషయాన్ని CBSE పరిశీలించాలని జస్టిస్ బాగ్చీ సూచించారు. అయితే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం నుంచే మూడు భాషలు చదవాలనుకుంటే.. వారికి ఆ అవకాశం కల్పించవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.

CBSE తాజా నోట్ ఇవ్వనుంది

6వ తరగతి నుంచే మూడు భాషలు చదవడం తప్పనిసరి చేసే విధానంపై కేంద్రం, CBSE ఇప్పటికే సుప్రీంకోర్టు సూచనలను పరిశీలిస్తున్నాయి. తాజాగా CBSE తన నిర్ణయంపై మరోసారి ఆలోచించి.. ఈ అంశంపై తాజా నోట్‌ను కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించింది. అంతకుముందు మే 27న ఈ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వం, CBSE, NCERTలకు నోటీసులు జారీ చేసి వారి స్పందన కోరింది.

3 భాషల విధానం అంటే..?

CBSE కొత్త విద్యా విధానంలో భాగంగా భాషల అధ్యయనానికి మార్పులు తీసుకొస్తోంది. 9వ తరగతి విద్యార్థులు మూడు భాషలు చదవాల్సి ఉంటుంది. ఇందులో కనీసం రెండు భారతీయ భాషలు ఉండాలని CBSE పేర్కొంది. భారతీయ భాషల్లో హిందీ, సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, గుజరాతీ, ఒడియా, అస్సామీ తదితర భాషలు ఉన్నాయి. మరోవైపు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, అరబిక్, స్పానిష్ వంటి భాషలను స్థానికేతర భాషల ఉదాహరణలుగా CBSE పేర్కొంది. ప్రస్తుతం 6వ తరగతిలో రెండు భారతీయ భాషలను తప్పనిసరి చేసే విధానం ఉంది. 7, 8, 9 తరగతుల్లో ఇప్పటికే రెండు స్థానికేతర భాషలను చదువుతున్న విద్యార్థులకు కొన్ని మినహాయింపులు కల్పించే నిబంధనలు ఉన్నాయి.

NEP 2020కి అనుగుణంగా మార్పులు

జాతీయ విద్యా విధానం-2020 (NEP 2020), నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్-2023 (NCF-SE 2023)కు అనుగుణంగా CBSE తన విద్యా విధానాన్ని మార్చుతోంది. ఇందులో భాగంగానే మూడు భాషల విధానాన్ని అమలు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. CBSE గతంలోనూ 9, 10 తరగతుల్లో మూడు భాషల ఫార్ములాను NCF-2023తో అనుసంధానం చేసే అంశంపై నిర్ణయాలు తీసుకుంది.