పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం వేగంగా బలపడుతోందని, ఇది అత్యంత తీవ్రస్థాయి ‘‘సూపర్ ఎల్నినో’’గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. ‘‘సూపర్ ఎల్నినో’’ పేరుతో ఎలాంటి అధికారిక కేటగిరీ లేదని స్పష్టం చేసింది. ఎల్నినో ప్రభావాన్ని భారత వాతావరణ శాఖ బలహీన, మోస్తరు, బలమైన, అత్యంత బలమైన స్థాయిలుగా మాత్రమే వర్గీకరిస్తుందని తెలిపింది.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన భూవిజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెండూ ‘‘సూపర్ ఎల్నినో’’ పేరుతో ప్రత్యేక కేటగిరీని గుర్తించలేదని వెల్లడించారు. భూమధ్యరేఖకు సమీపంలోని మధ్య పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో ఏర్పడే అసాధారణ పెరుగుదల ఆధారంగా ఎల్నినో తీవ్రతను ఐఎండీ అంచనా వేస్తుందని తెలిపారు.
ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటంతో.. కొనసాగుతున్న ఎల్నినో అసాధారణంగా తీవ్రంగా మారుతున్నట్లు పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, వాతావరణ సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం వేగంగా అభివృద్ధి చెందడం, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉండటంతో కొందరు దీనిని ‘‘సూపర్ ఎల్నినో’’గా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ పదం ప్రామాణిక వాతావరణ వర్గీకరణలో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఐఎండీ వివరాల ప్రకారం.. 2026 జూన్లో బలహీన స్థాయిలో ఎల్నినో పరిస్థితులు మొదలయ్యాయి. జూలై నాటికి ఇవి మోస్తరు స్థాయికి చేరుకున్నాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ 2026 మధ్య ఎల్నినో ప్రభావం మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఎల్నినో అత్యంత బలమైన కేటగిరీకి చేరుకోవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.
ప్రపంచ వాతావరణ సంస్థ కూడా ‘‘సూపర్ ఎల్నినో’’ అనే పదాన్ని ఉపయోగించదని తెలిపింది. ఈ పదం ప్రామాణిక, అధికారిక వాతావరణ వర్గీకరణల్లో భాగం కానందున దీనిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించబోమని డబ్ల్యూఎంఓ తన వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఎల్నినో తీవ్రతను మాత్రమే ఆధారంగా చేసుకుని భారత్పై దాని ప్రభావాన్ని ముందుగానే నిర్ధారించలేమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఎల్నినోతో పాటు సముద్రం, వాతావరణం మధ్య ఏర్పడే పరస్పర పరిస్థితులు ఎలా మారుతాయన్న దానిపై భారత్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ ప్రభావాలు ఆధారపడి ఉంటాయని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.
ఎల్నినో అనేది మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ దృగ్విషయం. సముద్ర ఉష్ణోగ్రతల్లో ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రసరణ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. దీంతో వర్షపాత నమూనాల్లో మార్పులు, సుదీర్ఘ ఉష్ణతరంగాలు, కరువు పరిస్థితులు, ఉష్ణమండల తుపాన్ల తీవ్రతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది.
భారత్లో గతంలో బలమైన ఎల్నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనపడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎల్నినో ఒక్కటే భారత రుతుపవనాలను ప్రభావితం చేయదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఓషన్ డైపోల్, మాడెన్-జూలియన్ ఆసిలేషన్ వంటి ఇతర వాతావరణ కారకాలు ఎల్నినో ప్రభావాన్ని మరింత పెంచవచ్చు లేదా కొంతవరకు తగ్గించవచ్చు.
ప్రభుత్వం ‘‘సూపర్ ఎల్నినో’’ అనే పదానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం చేసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో బలపడుతున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఉష్ణతరంగాలు, కరువు, అడవి మంటలు, వర్షపాతంలో అసాధారణ మార్పులు నమోదవుతున్నట్లు సమాచారం.
ఎల్నినోతో పాటు ఇతర వాతావరణ కారకాల పరిణామాలను ఐఎండీ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా కాలానుగుణ వాతావరణ అంచనాలు, దీర్ఘకాలిక అంచనాలు, రోజువారీ ప్రభావ ఆధారిత వాతావరణ హెచ్చరికలను జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ సంస్థలు, జిల్లా యంత్రాంగాలతో పంచుకుంటున్నట్లు పేర్కొంది. ఏడాది చివరి వరకు వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులకు ముందస్తు సన్నద్ధత, తగిన చర్యలు తీసుకునేందుకు ఈ హెచ్చరికలు ఉపయోగపడతాయని ఐఎండీ తెలిపింది.

