UP Elections: 2027లో జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న అయోధ్య అసెంబ్లీ స్థానానికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం అభ్యర్థిని ప్రకటించారు. అయోధ్య నుంచి పార్టీ పవన్ పాండేను బరిలో దింపబతోంది. లక్నోలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన బ్రహ్మణ సదస్సులో ఈ ప్రకటన వచ్చింది. పవన్ పాండే అయోధ్య నుంచి గెలవబోతున్నారని అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.
అయోధ్య అసెంబ్లీ సీటు రాజకీయంగా, మతపరంగా బీజేపీకి చాలా ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించబడుతోంది. ఇక్కడి నుంచి ఎస్పీ తన అభ్యర్థిని రంగంలోకి దింపి సవాల్ విసిరింది. రామ మందిరం ఈ నియోజకవర్గంలోనే ఉంది. దీంతో ఈ ప్రకటన ద్వారా బీజేపీని ఎస్పీ సవాల్ చేసినట్లైంది. అయోధ్య జిల్లాలోని దరియాబాద్, రుదౌలి, మిల్కిపూర్, బికాపూర్ మరియు అయోధ్య అనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
పవన్ పాండే నేపథ్యం ఇదే..
విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన పవన్ పాండేను అయోధ్య బరిలో ఎస్పీ నిలిపింది. ముక్కుసూటి శైలి, దూకుడు రాజకీయ వైఖరి, ప్రజా సమస్యలపై గళం విప్పుతారనే పేరుంది. పవన్ పాండే 1998లో విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రజా జీవితంలోకి ప్రవేశించారు. ఈ సమయంలో, ఆయన సమాజ్వాదీ ఉద్యమ వ్యవస్థాపక నాయకుడైన ములాయం సింగ్ యాదవ్తో పరిచయం ఏర్పడింది. 1999 నుంచి అఖిలేష్ యాదవ్కు సన్నిహితంగా ఉన్నారు. 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత లల్లూ సింగ్ను ఓడించారు. ఇటీవల, శ్రీ రామ్ జన్మభూమి ఆలయంలోని కానుకలు, విరాళాల చుట్టూ ఉన్న వివాదంపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, ట్రస్ట్ పనితీరును సమీక్షించాలని, పారదర్శకతను నిర్ధారించాలని ఆయన డిమాండ్ చేశారు.

