Sonam Wangchuk: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ తొలిసారిగా స్పందించారు. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’ అంటూ ఎక్స్లో పోస్టు చేశారు. జూన్ 28న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనకు మద్దతుగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ, నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి కేసులు ఉండబోవనే హామీ, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాలపై కేంద్రం హామీ ఇవ్వడంతో ఆయన 26 రోజుల నిరాహారదీక్షను గురువారం విరమించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయన విక్టరీ సింబర్ చూపుతూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ‘‘వీధుల నుంచే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ఇది శాంతి, సహనం, పట్టుదల సాధించిన విజయం’’ అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, దేశ యువతకు ఆయన అభినందనలు తెలిపారు. భయాన్ని వీడి ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇకపై ఉద్యమం జవాబుదారీతనం, విద్యాసంస్కరణల దిశగా ముందుకు సాగుతుందని అన్నారు.

