కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మెటా సంస్థ చంపేసింది. ఇటీవల ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూశారు. ఆమె మృతికి సంతాపం తెల్పుతూ సిద్ధరామయ్య కన్నడలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ను ఇంగ్లీషులోకి మెటా సంస్థ తప్పుగా అనువదించింది. సిద్ధరామయ్య కన్నుమూత అంటూ అనువదించింది. ఈ పరిణామం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పింది. దీంతో మెటాకు సిద్ధరామయ్య ఘాటు లేఖ రాశారు. కన్నడ ఆటో ట్రాన్స్లేషన్ ఫీచర్ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Trump: పాకిస్థాన్లో ట్రంప్ పర్యటన వార్తలపై స్పందించిన వైట్హౌస్
కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం ఫేస్బుక్లో నటి సరోజా దేవి మృతికి సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే ఈ సందేశాన్ని మెటో ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ టూల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరణించారని తప్పుగా అనువాదం చేసింది. దీంతో సిద్ధరామయ్య సర్కార్కు ఆగ్రహం తెప్పించింది. తక్షణమే మెటా టూల్ను తొలగించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Vizag: నేడు ఐఎన్ఎస్ నిస్తార్ నౌక జాతికి అంకితం
సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం కోరింది. కచ్చితంగా నిర్ధారించేంత వరకు ఫీచర్ను మూసేయాలని కోరింది. భవిష్యత్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఇది చాలా ప్రమాదకరమని మీడియా సలహాదారు ప్రభాకర్ అధికారికంగా మెటాకు లేఖ రాశారు.
జరిగిన పొరపాటుపై మెటా సంస్థ క్షమాపణ చెప్పింది. ఇలా జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొంది. కన్నడ అనువాదం సరిగా లేదనే సమస్యను పరిష్కరించామని మెటా ప్రతినిధి తెలిపారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని కంపెనీ ఫేస్బుక్లో పేర్కొంది. కచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించింది. సాంకేతికతను మెరుగుపరచడానికి నిరంతరం అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పింది.
