Shashi Tharoor Reveals Sensational Secrets: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎంపీ శశిథరూర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అయితే.. ఇటీవల ఆయన్ను ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని కథనాలు చక్కర్లు కొట్టాయి. వాటిల్లో ఏమాత్రం వాస్తవం లేదని శశిథరూర్ తాజాగా స్పష్టం చేశారు. కానీ.. కొందరు సీనియర్లు మాత్రం తనపై కంప్లైంట్ చేశారన్న మరో షాకింగ్ విషయాన్ని ఆయన ఈ సందర్భంగా రివీల్ చేశారు. అధ్యక్ష పదవికి తాను సరితూగనని, నామినేషన్ను ఉపసింహరించుకునేలా తనని విజ్ఞప్తి చేయాల్సిందిగా రాహుల్ గాంధీని కొందరు సీనియర్ నేతలు కోరారని చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే తనతో చెప్పారని శశి థరూర్ పేర్కొన్నారు.
‘‘ఇటీవల రాహుల్ గాంధీతో సంబాషణ జరిపినప్పుడు.. నన్ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని రాహుల్ని కొందరు సీనియర్లు కోరారట. కానీ, రాహుల్ మాత్రం అందుకు అంగీకరించలేదు. నేను పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకీ మేలు జరుగుతుందని తాను భావిస్తున్నట్టు.. రాహుల్ వారికి వివరించారని చెప్పారు. పైగా.. పార్టీ అధినేత పదవికి పోటీ చేయాలని పదేళ్ల నుంచి చెప్తున్నానంటూ.. ఆయనకు నాకు గుర్తు చేశారు’’ అని శశిథరూర్ తెలిపారు. తన మద్దతుదారులలో ఎక్కువ మంది యువ నేతలు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న థరూర్.. సీనియర్లు నాకు మద్దతు ఇస్తారని ఏనాడూ అనుకోలేదని బాంబ్ పేల్చారు. అయితే యువతతో పాటు అన్ని వయస్కుల నుంచి తనకు మద్దతు అవసరమని, అందుకే ఏ ఒక్కరినీ తగ్గించి మాట్లాడనని థరూర్ అన్నారు.
ఇదిలావుండగా.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 17న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. సుమారు 9,000 మందికి పైగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రతినిధులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం.. మార్పు నినాదంతో శశిథరూర్ ప్రచారం నిర్వహిస్తుండగా, దళిత మార్క్తో మలికార్జున ఖర్గే బరిలో దిగుతున్నారు.