UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..

  • షహజాద్ భట్టి నెట్వర్క్‌పై కేంద్ర ఉక్కుపాదం.
  • UAPA కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటన.
  • పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠా.
Shahzad Bhatti

Shahzad Bhatti

UAPA: పాకిస్తాన్ గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది షహజాద్ భట్టికి చెందిన నెట్వర్క్‌పై కేంద్ర ప్రభుత్వం ఉక్కపాదం మోపింది. షహజాద్ భట్టి ముఠాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ బుధవారం వెల్లడించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్ అక్రమ రవానా, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం వంటి కార్యకాలపాలకు ఈ నెట్వర్క్ పాల్పడుతున్నట్లు కేంద్రం పేర్కొంది.

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గానికి చెందిన వ్యక్తుల్ని, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తుల్ని సోషల్ మీడియా, ఎఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆకర్షించి ఈ ముఠా నియమించుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆగస్టు 12న షహజాద్ భట్టి నెట్వర్క్‌పై దేశవ్యాప్తంగా సమన్వయంతో భద్రతా సంస్థలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ చర్యలో 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నెట్వర్క్‌కు సంబంధించి 80కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, 200 మందిని అరెస్ట్ చేశారు.

పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా భారత్‌లోకి ఆయుధాలు, డ్రగ్స్, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో తయారైనట్లు ఉన్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్‌లు ఉపయోగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రెనేడ్ దాడులు, ఐఈడీ పేలుళ్లు, పెట్రోల్ బాంబు దాడులు, టార్గెటెడ్ కిల్లింగ్స్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ నెట్వర్క్‌కు ‘తెహ్రీక్-ఎ-తాలిబాన్ హిందుస్థాన్’ (TTH) పేరుతో పనిచేసే గ్రూపుతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. UAPA చట్టంలోని పలు సెక్షన్ల కింద నిషేధిత ఉగ్రవాద సంస్థగా కేంద్రం ప్రకటించింది.