Scoot Airlines Incident: ఇటీవల బెంగళూర్ విమానాశ్రయంలో 50 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది ఇండిగో ఫ్లైట్. ఈ ఘటన మరవక ముందే సింగపూర్ కు చెందిన బడ్జెట్ ఎయిర్ లైనర్ ‘స్కూట్ ఏయిర్ లైన్స్’ 35 మంది ప్రయాణికులను వదిలేసి వెళ్లింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. స్కూట్ ఎయిర్ లైన్స్ విమానం పంజాబ్ అమృత్ సర్ నుంచి సింగపూర్ కు వెళ్లాల్సి ఉంది. అయితే విమానం బుధవారం సాయంత్రం 7.55 నిమిషాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా మూడు గంటల ముందే మధ్యాహ్నం 3.45 గంటలకు వెళ్లింది.
Read Also: Farzi: నకిలీ నోట్ల కుంభకోణం వెనుక కె కె మీనన్!
విమానంలో 263 మంది సకాలంలో విమానాశ్రయానికి చేరుకుని సింగపూర్ వెళ్లిపోయారు. మరో 35 మందికి సమాచారం లేకపోవడంతో విమానాన్ని అందుకోలేకపోయారు. 35 మంది తమ ఫ్లైట్ మిస్సవడానికి బుకింగ్ ఏజెంట్ కారణమని అమృత్సర్ విమానాశ్రయం డైరెక్టర్ వికె సేథ్ ఆరోపించారు. బుకింగ్ ఏజెంట్లందరికీ సకాలంలో సమాచారం అందించారు, వారంతా తమ ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసారు. కానీ ఒక ఏజెంట్ మాత్రమే ప్రయాణికులకు రీషెడ్యూల్ అయిన సమయాన్ని తెలియజేయలేదని సేథ్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్కూట్ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసింది. ప్రతీకూల వాతావరణం కారణంగానే విమానం రీషెడ్యూల్ చేయబడిందని ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. బాధితులకు క్షమాపణలు చెబుతూ.. వారికి అవసరమైన సహాయం చేస్తామని వెల్లడించారు. స్కూట్ ఎయిర్ లైన్స్, సింగపూర్ ఎయిర్ లైన్స్ అనుబంధ సంస్థ. బడ్జెట్ ప్రయాణాలకు స్కూట్ ఎయిర్ లైన్స్ పేరొందింది.