NTV Telugu Site icon

Sandeshkhali: సందేశ్‌ఖాలీ ఘటనలో “ప్రభావవంతమైన” వ్యక్తులపై సీబీఐ ఎఫ్ఐఆర్..

Sandeshkhali

Sandeshkhali

Sandeshkhali: దేశంలో రాజకీయంగా చర్చనీయాంశమైన పశ్చిమ బెంగాల్ సందేశ్‌ఖాలీ మహిళల లైంగిక వేధింపులు, భూకబ్జా, హింసకు సంబంధించిన కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఐదుగురు ప్రభావవంతమైన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ గురువారం వెల్లడించారు. అయితే వీరి గుర్తింపును సీబీఐ బయలకు చెప్పలేదు. కేవలం ప్రభావంతమైన వ్యక్తులుగా పేర్కొంది. కలకత్తా హైకోర్టు ఏప్రిల్ 10 ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షలో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఫిర్యాదులు చేయడానికి సీబీఐ ఓ ఈమెయిల్ ఐడీని కూడా ప్రచారం చేసింది. గత వారం సీబీఐకి చెందిన 10 మంది అధికారులు సందేశ్‌ఖాలీని సందర్శించి మహిళలపై నేరాలు, భూకజ్జాలపై విచారణ జరిపింది.

Read Also: Rashmika mandhana: మరోసారి రెమ్యూనరేషన్ ను పెంచేసిన రష్మిక మందన్న?

లోక్‌సభ ఎన్నికల ముందు సందేశ్‌ఖాలీ సంఘటనలో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోయింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన షేక్ షాజహాన్, అతని ఇతర అనుచరులు నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇదే కాకుండా భూకజ్జాలకు పాల్పడ్డారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు షేక్ షాజహాన్‌కి వ్యతిరేకంగా తిరబడ్డారు. దీంతో అతను 55 రోజుల పాటు పరారీలో ఉన్నాడు.

మహిళల ఉద్యమానికి బీజేపీ మద్దతుగా నిలిచింది. సీఎం మమతా బెనర్జీ అండతోనే టీఎంసీ గుండాలు రెచ్చిపోతున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఈ ఘటనపై కలకత్తా హైకోర్టు, గవర్నర్ స్పందించడంతో బెంగాల్ పోలీసులు షేక్ షాజహాన్‌ని 55 రోజుల తర్వాత అరెస్ట్ చేశారు. ఈ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. దీనిని ఛాలెంజ్ చేస్తూ మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అంతకుముందు జనవరి 5న సందేశ్‌ఖాలీలో రేషన్ కుంభకోణాన్ని విచారణ జరిపేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై షేక్ షాజహాన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తర్వాత అతని అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.