S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

  • విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..
  • 29 ఏళ్లకే మంత్రి పదవి, 5 భాషల్లో ప్రావీణ్యం..
  • శివకాశి నుంచి గెలుపు, రాజకీయ స్ట్రాటజిస్ట్‌గా అనుభవం..
S Keerthana

S Keerthana

S Keerthana: తమిళనాడులో కొత్త శకం ప్రారంభమైంది. 5 దశాబ్ధాల ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని ఎదురించి, విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా విజయ్ ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. విజయ్‌తో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, వీరందరిలో 29 ఏళ్ల వయసు కలిగిన ఎస్ కీర్తన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. విజయ్ కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలిగా కీర్తన ఉన్నారు.

5 భాషల్లో ప్రావీణ్యం: 

హిందీ అంటేనే వ్యతిరేక భావాలు కలిగిన తమిళనాడులో, కీర్తన అనర్గళంగా హిందీలో మాట్లాడగలదు. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా ఐదు భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. రాజకీయాలు అంటే ముందు నుంచి కీర్తనకు ఆసక్తి. ఇదే ఆసక్తి ఆమెను రాజకీయ వ్యూహాకర్తగా పనిచేసేలా ప్రేరేపించాయి. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో శివకాశి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశోకను 11,670 ఓట్ల తేడాతో ఓడించి గెలుపొందారు. ఏడు దశాబ్ధాలలో శివకాశి నుంచి గెలిచిన మహిళా అభ్యర్థిగా కీర్తన రికార్డ్ క్రియేట్ చేశారు.

కీర్తన విద్యా, రాజకీయ ప్రవేశం:

1996లో విరుదునగర్‌లో జన్మించిన కీర్తన, తమిళ మీడియం ప్రభుత్వ పాఠశాలలో తన విద్యను మొదలుపెట్టారు. దీని తర్వాత మదురై కామరాజ్ యూనివర్సిటీ అనుబంధ కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత పుదుచ్చేరి యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎమ్మెస్సీ చేశారు. రాజకీయాలకు రాకముందు ఆమె రాజకీయ కన్సల్టెంట్‌గా పనిచేశారు. డిజిటల్ క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేశారు. ఐ-ప్యాక్, షోటైమ్ కన్సల్టింగ్ సంస్థల్లో పనిచేశారు.

తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీల ఎన్నికల ప్రచారాల్లో కీలక పాత్ర పోషించారు. మాజీ సీఎం స్టాలిన్, మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వంటి నేతలతో కలిసి పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. విజయ్ మెసేజ్‌ను దేశవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో తాను హిందీ నేర్చుకున్నట్లు కీర్తన చెప్పారు.

విజయ్ ప్రచారంలో కీలకం:

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పనిచేసిన అనుభవంతో టీవీకే పార్టీ ప్రచారాన్ని కీర్తన హోరెత్తించారు. సోషల్ మీడియా ప్రచారం, బూత్ స్థాయిలో వ్యూహరచన వంటి విషయాలు ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఎన్నికల ప్రచార సమయంలో శివకాశి అభివృద్ధి, భద్రతకు సంబంధించిన అంశాలను ఆమె లేవనెత్తారు. తరుచుగా బాణాసంచా పేలుళ్లలో వినిపించే శివకాశిలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడాన్ని ఆమె ప్రస్తావించారు. బాణాసంచా పరిశ్రమలో కార్మికులకు బీమా, మహిళలకు సమాన వేతనం, ఆరోగ్య పరీక్షలు, మెరుగైన చికిత్స వంటి అంశాలను లేవనెత్తారు.