ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన కొత్త కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా… రాత్రి శాఖలు కేటాయించారు ప్రధాని మోడీ.. ఇక, ఇవాళ సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం.. కరోనా తాజా పరిస్థితులు, థర్డ్ వేవ్ ఎదుర్కోవడంపై చర్చించింది.. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర్డ్ వేవ్కు సన్నద్ధమయ్యేందుకు కొత్త అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద రూ.23,132 కోట్ల ఫండ్ను ప్రకటించింది. ఆ మొత్తంలో రూ.15,000 కోట్ల నిధులను కేంద్రం ఖర్చు చేస్తుందని, రూ.8,000 కోట్ల నిధులను రాష్ట్రాలకు కేటాయిస్తారని తెలిపారు కొత్త కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా..
మరోవైపు థర్డ్వేవ్ను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతోంది కేంద్రం.. 736 జిల్లాల్లో పీడియాట్రిక్స్ విభాగాలు, 20,000 కొత్త ఐసీయూ పడకల ఏర్పాటు ఇందులో 20 శాతం పడకలు పిల్లల కోసం, నర్సింగ్ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు, జిల్లా స్థాయిలో ఔషధాల బఫర్ స్టాక్ కోసం ఈ ప్యాకేజీ సహాయపడుతుందని వెల్లడించారు మాండవియా.. రానున్న 9 నెలల్లో ఈ ప్యాకేజీని అమలు చేస్తామని, వచ్చే ఏడాది మార్చిలోపు ఇది పూర్తవుతుందని వివరించారు. ఇక, నూతన సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని తోమర్ స్పష్టం చేశారు.. సాగు చట్టాల వల్ల మండీలకు వచ్చే నష్టమేమీ లేదని, నూతన సాగు చట్టాల అమలు వల్ల మండీలకు కోట్ల రూపాయల లాభం వస్తుందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే తాము కొకొనట్ బోర్డు యాక్ట్ను సవర్తిస్తున్నామని ప్రకటించారు.