Most wanted: అమెరికాలో నాలుగేళ్ల క్రితం 29 ఏళ్ల భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయింది. అప్పటి నుంచి ఆమె కోసం అక్కడి ఏజెన్సీలు వెతుకుతున్నాయి. తాజాగా ఎఫ్బీఐ తన మోస్ట్ వాంటెడ్ లిస్టులో భారతీయ మహిళ పేరును చేర్చింది. FBI అధికారులు ఈమె జాడను తెలియజేయాలని ప్రజలను కోరుతున్నారు.
29 ఏళ్ల భారతీయ విద్యార్థిని మయూషి భగత్ నాలుగేళ్ల క్రితం న్యూజెర్సీ నుంచి కనిపించకుండా పోయింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆమెను మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చడంతో పాటు ఆమె ఆచూకీ తెలిపితే ఏకంగా 10,000 డాలర్ల రివార్డును ప్రకటించింది. న్యూజెర్సీ సిటీలోని తన అపార్ట్మెంట్ నుంచి చివరిసారిగా ఏప్రిల్ 29, 2019 సాయంత్రం రంగురంగుల పైజామా ప్యాంట్, నల్లటి టీషర్టు ధరించి బయటకి వెళ్లింది. అదే ఆమెను చివరిసారిగా చూడటం, అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేకుండాపోయింది. మే 1, 2019న ఆమె అదృశ్యమైనట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Also: Central Funds: కేంద్రం నిధుల విడుదల.. ఏపీకి రూ.2,952 కోట్లు.. తెలంగాణకు 1,533 కోట్లు..
ఎఫ్బీఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్, జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆమె ఆచూకీ కోసం ప్రజల సాయాన్ని కోరుతోంది. గత ఏడాది జూలైలో ఎఫ్బీఐ మిస్సింగ్ వ్యక్తుల జాబితాలో భగత్ పేరును చేర్చింది. జూలై 1994లో భారతదేశంలో జన్మించిన భగత్ స్టూడెంట్ వీసాపై అమెరికాలోని న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోంది. ఎఫ్బీఐ ప్రకటన ప్రకారం.. ఆమె ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మాట్లాడుతుందని, న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ ఫీల్డ్లో ఆమెకు స్నేహితులు ఉన్నారని డిటెక్టివ్స్ చెప్పారు. ఆమె ఆచూకి లేదా అదృశ్యం గురించి ఎవరి వద్ద అయినా సమాచారం ఉంటే FBI నెవార్క్ లేదా జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేయాలని FBI తెలిపింది. తన వెబ్సైట్లోని “మోస్ట్ వాంటెడ్” పేజీలో భగత్కి సంబంధించి ‘తప్పిపోయిన వ్యక్తి’ పోస్టర్ను “కిడ్నాప్లు/తప్పిపోయిన వ్యక్తులు” జాబితా క్రింద ఉంచింది.