President Of India: రాష్ట్రపతి అంటే దేశ ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు అని అర్థం. అందుకే రాష్ట్రపతి పదవిని అత్యున్నత పదవిగా అందరూ భావిస్తారు. అలాంటి అత్యున్నత పదవిని గిరిజన మహిళ ద్రౌపది ముర్ము సొంతం చేసుకున్నారు. ఆమె ఈరోజు అంటే జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. ముర్మునే కాదు.. గతంలో కూడా పలువురు రాష్ట్రపతులు జూలై 25నే ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఇదే తేదీన రాష్ట్రపతులు ప్రమాణస్వీకారం చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. భారతదేశానికి మొదటి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950, జనవరి 26న ప్రమాణం చేశారు. అనంతరం 1952 రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆయన గెలవడంతో పాటు 1957లో కూడా మళ్లీ విజయం సాధించారు. 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
Read Also: President Of India: భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము
అయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. డాక్టర్ జాకీర్ హుస్సేన్ రాష్ట్రపతిగా 1967 మే 13న ప్రమాణ స్వీకారం చేయగా.. 1969, మే 3న మరణించారు. అనంతరం రాష్ట్రపతి పదవి దక్కించుకున్న వివి గిరి, ఫకృద్దీన్ అలీ వివిధ కారణాలతో పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో జూలై 25న బాధ్యతలు స్వీకరించి ఐదేళ్ల తర్వాత జులై24న పదవీ విరమణ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పటివరకు మొత్తం 9 మంది రాష్ట్రపతులు ఇలా జూలై 25నే ప్రమాణం చేశారు. ఈ జాబితాలో ద్రౌపది ముర్ము పదో వ్యక్తిగా చేరడం విశేషం.