NTV Telugu Site icon

Ranya Rao: వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం.. కట్టుకథ అల్లినట్లుందే..?

Ranyarao

Ranyarao

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నటి రన్యారావుకు సంబంధించిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. బుధవారం బెయిల్ పిటిషన్‌పై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం ఎదుట అధికారులు ఉంచారు.

యూట్యూబ్ చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నట్లు తెలిపింది. దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ఉండగా ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని.. బంగారాన్ని బెంగళూరు డెలివరీ చేయాలని చెప్పినట్లుగా అధికారులకు తెలిపింది. రెండు ప్లా్స్టిక్ కవర్లలో బంగారాన్ని ఇచ్చారని.. దాన్ని దాచేందుకు బ్యాండేజ్‌లు, కత్తెర సమీపంలో ఉన్న స్టేషనరీలో కొనుగోలు చేసినట్లు తెలిపింది. రెస్ట్‌రూమ్‌కు వెళ్లి బంగారం బిస్కెట్లను అతికించుకున్నట్లు తెలిపింది. ఇదంతా యూట్యూబ్ చూసే నేర్చుకున్నట్లు వాంగ్మూలంలో తెలిపింది. అయితే బంగారం ఇచ్చిన వ్యక్తి మాత్రం తనకు తెలియదని.. అతడి భాషను బట్టి ఆఫ్రికన్-అమెరికన్‌లా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇంతకముందు ఎప్పుడు బంగారం తీసుకురాలేదని.. ఇదే తొలిసారి అని పేర్కొంది. బెంగళూరు ఎయిర్‌పోర్టులోంచి బయటకు వచ్చాక.. ఒక ఆటోలో పెట్టేసి వెళ్లిపోవాలని చెప్పారని అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు తెలిపింది.

మార్చి 3న బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యారావు పట్టుబడింది. రూ.12 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత ఆరు నెలల్లో రన్యారావు దుబాయ్‌కి 27 ట్రిప్పులు వెళ్లింది. నాలుగు ట్రిప్పులు మాత్రం కేవలం 15 రోజుల వ్యవధిలో జరిగాయి. అయితే వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన డ్రస్‌ వేసుకుని వెళ్లింది. అయితే వీఐపీ ప్రొటోకాల్‌ ఉపయోగించుకుని బయటకు వచ్చేసింది. రన్యారావు తండ్రి రామచంద్రరావు ఐపీఎస్ ఆఫీసర్. అతడి హోదాను ఉపయోగించుకుని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. మరోవైపు రన్యారావు స్నేహితుడు తరుణ్ రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు నెలల క్రితమే జతిన్ హుక్కేరి అనే ఆర్కిటెక్‌ను రన్యారావు పెళ్లి చేసుకుంది. కానీ అతడితో సంసారం చేయలేదు. తరుచుగా విదేశాలకు వెళ్తూ ఉండేది. ఇక ఆమె పెళ్లికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై ఖరీదైన బహుబతులు ఇచ్చారు. దీనిపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి వీడియోలు పరిశీలిస్తున్నారు.