NTV Telugu Site icon

Ranya Rao Case: రన్యా రావు కేసులో సంచలనం.. హవాలా డబ్బుతో బంగారం కొన్నట్లు వెల్లడి..

Ranya Rao

Ranya Rao

Ranya Rao Case: సినీ నటి, బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిన రన్యా రావు కేసులు సంచలనం నమోదైంది. బంగారం కొనుగోలుకు హవాలా మార్గాల్లో డబ్బును బదిలీ చేసినట్లు అంగీకరించింది. ఈ విషయాన్ని ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) న్యాయవాది మధురావు ఈ వాదనను వినిపించారు. నిందితురాలు అనధికార మార్గాల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అంగీకరించారని ఆయన కోర్టులో వాదించారు. ఈ విషయంపై న్యాయ విచారణ ప్రారంభించాలని అధికారులు సెక్షన్ 108 కింది నోటీసులు జారీ చేశారు. ఈ విచారణ న్యాయ విచారణలో భాగమని, పోలీసు విచారణ కాదని అధికారులు స్పష్టం చేశారు. ఆర్థిక అవకతవకలు ఎంత వరకు జరిగాయనేది, చట్టం ఉల్లంఘించారా..? లేదా..? అనేది గుర్తించడం ఈ దర్యాప్తు లక్ష్యం.

Read Also: Perni Nani: ఏదో రకంగా జగన్‌ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు..! మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

12 కోట్ల రూపాయల విలువైన 14.8 కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై రన్యా రావును మార్చి 4, 2025న అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. నడుము బెల్టులో బంగారాన్ని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కనుగొంది. మొత్తం ఆమె నుంచి రూ. 17.29 కోట్ల విలువైన బంగారం, నగదుని స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు దాదాపుగా 30 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ప్రతీ సందర్భంలోనూ ఆమె పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె అక్రమంగా తరలించే ప్రతీ కిలో బంగారానికి లక్ష రూపాయాలు సంపాదించిందని, ఒక్కో ట్రిప్పుకు రూ. 12-13 లక్షలు సంపాదించేదని తెలిసింది. దీనికి తోడు ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) కే రామచంద్రారావు కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈయనను కర్ణాటక ప్రభుత్వం సెలవులపై పంపింది.