Rajasthan: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు

  • రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం
  • దుమ్ము మేఘాలతో కప్పుకుపోయిన నగరం
  • బెంబేలెత్తిపోయిన ప్రజలు
Rajasthan

Rajasthan

ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లో అకస్మాత్తుగా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 127 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో పెద్ద ఎత్తున భారీ నష్టం కలిగించి. సేమ్ అదే రీతిగా రాజస్థాన్‌లో కూడా శనివారం పట్టపగలు ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలుల మధ్య ఇసుక తుఫాన్ హడలెత్తించడంతో ఇళ్లల్లోకి ఇసుక రావడంతో ప్రజలకు కంటి చూపు కనిపించక అల్లాడిపోయారు. ఇక రహదారులైతే ధూళితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక ఇసుక తుఫాన్ అనంతరం భారీ వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా సంభవించిన భారీ తుఫాన్‌తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? లేదంటే గాయపడ్డారా? అన్నది ఇంకా తెలియలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా శ్రీ గంగానగర్‌ను దుమ్ము మేఘాలు కమ్మేశాయి. అలాగే బికనీర్‌లో కూడా భారీ ధూళి సృష్టించింది. ఒక్కసారిగా వేగంగా వీచిన ఈదురుగాలులతో పెద్ద ఎత్తున ధూళి గాలిలోకి ఎగసిపడడంతో నగరమంతా దుమ్ము మేఘాలతో కప్పుకుపోయింది. పలు ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల వాహనాలు హెడ్‌లైట్లు వెలిగించుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

×
×
Ad

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని బలమైన గాలులు వీచాయి. అనంతరం భారీగా ధూళి ఎగసిపడుతూ ఆకాశాన్ని పూర్తిగా కమ్మేసింది. దీంతో ప్రజలు ఇళ్లలోనే బయటకు రాలేదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ధూళి తుఫాన్ల సమయంలో అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.