Rajasthan: రాజస్థాన్లో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా హతమార్చడు ఓ వ్యక్తి. దీనికి కారణం వింటే అంతా ఆశ్చర్యపోవడం ఖాయం. భార్య తరుచుగా ఫోన్ ద్వారా ‘ఆత్మ’లతో మాట్లాడుతోందని ఆరోపించాడు. ఈ ఘటన బార్మర్ జిల్లాలో జరిగింది. తన భార్య ఆత్మలతో ఫోన్ ద్వారా మాట్లాడుతోందని అనుమానించిన భర్త ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున చున్నీలాల్ తన భార్య జియోదేవీ(40)ని గొడ్డలితో నరికి చంపాడు.
Read Also: Prudhviraj: పృథ్విరాజ్ పై అరెస్ట్ వారెంట్ జారీ.. మనోవర్తి చెల్లించాలంటూ..
జియోదేవీ తన ఫోన్ ద్వార ఆత్మలతో కమ్యూనికేట్ అవుతోందని భర్త అనుమానిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దంపతులకు 17 ఏళ్ల కుమార్తె సుమిత్ర దాడి సమయంలో తండ్రి చున్నీలాల్ని ఆపేందుకు ప్రయత్నించింది. ఈ దాడిలో గాయపడింది. అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా.. తల్లికూతుళ్లు ఇద్దరు తీవ్రంగా గాయపడి ఉన్నారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జియోదేవీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మంగళవారం రాత్రి చున్నీలాల్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి రాత్రి భోజనం చేసినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో చున్నీలాల్ నిద్రలేచి భార్యపై దాడి చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు ఇరుగుపొరుగు వారు ఫోన్లో పోలీసులకు వివరాలు అందించారు. సుమిత్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చున్నీలాల్ను హత్య కేసులో అరెస్టు చేశారు. జియో దేవి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు మరియు దర్యాప్తు కొనసాగుతోంది.