NTV Telugu Site icon

రాహుల్‌, పీకే ఫోన్లు కూడా ట్యాప్‌..!

Rahul Gandhi

Rahul Gandhi

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్‌ వ్యవహారం కలకలం రేపుతోంది.. ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని నివేదికలు రాగా.. పెగాస‌స్ హ్యాకింగ్ నివేదిక‌పై ఇవాళ పార్ల‌మెంట్‌లోనూ దుమారం రేగింది.. అయితే ఆ స్పైర్‌వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జి మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీల ఫోన్‌పై కూడా పెగాసస్‌ నిఘా సాఫ్టేవర్‌తో ట్యాప్‌ చేసినట్లు వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 17 వార్త సంస్థలు పెగాసస్‌ ప్రాజెక్ట్‌ పేరుతో చేసిన పరిశోధనాత్మక కథనాలు తరువాతి భాగం ఇవాళ ప్రచురించగా.. ప్రశాంత్ కిషోర్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసిన విషయం నిజమేనని, ఆయన ఫోన్‌ను తాము అమ్నెస్టి ఇంటర్నేషనల్‌కు చెందిన సెక్యూరిటీ ల్యాబ్‌ వద్ద ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించినట్లు కొన్ని జాతీయ స్థాయి వెబ్‌సైట్లు రాశాయి..

ఇక, అభిషేక్‌ బెనర్జి పర్సనల్‌ సెక్రటరీ ఫోన్‌ కూడా హ్యాకింగ్‌కు గురైంది. అయితే వీరి ఫోన్లను ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేయలేదని తెలిపాయి.. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ సంస్థ తన నిఘా సాఫ్ట్‌వేర్‌ను కేవలం కేంద్ర ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తుంది. దీన్నిబట్టి చూస్తే ఎన్నికల సమయంలో ప్రశాంత్‌ కిషోర్‌ ఫోన్‌ను ప్రభుత్వం హ్యాక్‌ చేసినట్లు తెలుస్తోంది. 2018 నుంచి 2019 ఎన్నికల ముందు వరకు ప్రశాంత్‌ కిషోర్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేశారని ఫోరెన్సిక్ పరీక్షలు బయటపడింది. హ్యాక్ అయిన డేటాబేస్‌లో సుమారు 300 మంది భార‌తీయుల ఫోన్ నెంబ‌ర్లు ఉన్నాయని తెలుస్తుండగా.. అందో 40 మంది జ‌ర్నలిస్టులు కూడా ఉన్నట్లు ప్రాథ‌మిక అంచనా..