Rahul Gandhi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. తనను దేవుడు పంపాడని చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీల వంటి పారిశ్రామికవేత్తల కోసం ప్రధాని నరేంద్రమోడీని పరమాత్మ పంపారని, పేదల కోసం కాదని రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు. ఉత్తర్ ప్రదేశ్లోని డియోరియాలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రతీ ఒక్కరు జీవసంబంధం కలిగి ఉంటారు, ప్రధాని నరేంద్రమోడీ మాత్రం జీవసంబంధమైనవారు కాదు. అంబానీ, అదానీలకు సాయం చేయడాని అతడిని పరమాత్మ పంపింది, పేదలకు, రైతులకు సాయం చేయడానికి కాదు’’ అని అన్నారు. దేవుడు వారిని పంపి ఉంటే, అతను పేదలకు, రైతులకు సాయం చేసి ఉండేవారు, అతను ఎలాంటి దేవుడు.? అని ప్రశ్నించారు.
Read Also: Shraddha Walkar case: శ్రద్ధావాకర్ మర్డర్ కేసులో మరిన్ని ఆధారాలతో మరో ఛార్జిషీట్..
చివరి దశ ఎన్నికలు జూన్ 1న జరగబోతున్నాయి. దీని కోసం ఈ రోజు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో ప్రధానిని ఉద్దేశించి సెటైర్లు వేశారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ఓ వార్తా ఛానెల్కి ఇంటర్వ్యూ ఇస్తూ.. తాను జీవసంబంధమైనవాడిని కాదని, దేవుడిచే పంపబడ్డానని పేర్కొన్నారు. మా అమ్మ బతికున్నంత వరకు తాను బయోలాజికల్గా జన్మించానని అనుకునే వాడినని, అయితే ఆమె చనిపోయిన తర్వాత కొన్ని అనుభవాలను బట్టి చూస్తే, తనను దేవుడు పంపాడని నమ్ముతున్నానని అన్నారు.
ఇదిలా ఉంటే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిధిని తొలగిస్తుందని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని ఇండియా కూటమి కాపాడుతుందని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించాలని ఇండియా కూటమి ఒకవైపు ఉంటే, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకునే వారు మరోవైపు ఉన్నారంటూ బీజేపీ కూటమిని విమర్శించారు. తమ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్నివీర్ పథకాన్ని తొలగించి, చెత్తబుట్టలో వేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.