లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ప్రతిపక్ష ఎంపీలతో కలిసి కలిశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీ, నీట్ పరీక్షల అక్రమాల వ్యవహారంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల గొంతును పార్లమెంట్లో వినిపించే వరకు ప్రతిపక్షం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
సమావేశం అనంతరం రాహుల్ గాంధీ ఎక్స్లో స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్ష ఎంపీలతో కలిసి లోక్సభ స్పీకర్ను కలిశాం. మా డిమాండ్ చాలా స్పష్టం. నిన్న విద్యార్థులపై జరిగిన దారుణమైన లాఠీచార్జీ, పరీక్షల సంక్షోభంపై ప్రభుత్వం చూపుతున్న పూర్తి బాధ్యతారాహిత్యంపై పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరగాలి.’’ అని పేర్కొన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకే వారిపై దాడి చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘‘యువత భవిష్యత్తుపై పార్లమెంట్లో చర్చించకపోతే.. ఆ పార్లమెంట్ ఉద్దేశమేంటి? ఈ అంశాన్ని ప్రతిపక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పడనివ్వదు. విద్యార్థుల గొంతు వీధుల్లోనూ, పార్లమెంట్లోనూ వినిపించేలా చేస్తాం.’’ అని అన్నారు.
మోడీపై తీవ్ర విమర్శలు
అంతకుముందు సోమవారం కూడా రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ చరిత్రలోనే ‘యువతకు అత్యంత వ్యతిరేక ప్రధానమంత్రి మోడీయేనని ఆరోపించారు. ‘‘152 ప్రశ్నాపత్రాల లీకులు జరిగాయి. 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారు. కానీ ఒక్క నిందితుడికి కూడా శిక్ష పడలేదు. శిక్ష పడింది మాత్రం కష్టపడి చదివిన యువతకే.’’ అని ఎక్స్లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.
‘సంసద్ చలో’ మార్చ్లో ఉద్రిక్తత
సోమవారం ‘సంసద్ చలో’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులు, నిరసనకారులు పార్లమెంట్ స్ట్రీట్ సమీపంలో చేరుకున్నారు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే పార్లమెంట్ వైపు ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటన అనంతరం ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఢిల్లీ పోలీసులు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

