Rahul Gandhi Fires For Hiking GST Rates: ఆధార ధరలపై కేంద్రం జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. పన్నులు పెంచుతున్నారు కానీ, ఉద్యోగాలు ప్రకటించడం లేదంటూ అధికార బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘‘పన్నులేమో అధికం, ఉద్యోగాలేమో శూన్యం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశాన్ని నాశనం చేయడంలో బీజేపీది మాస్టర్ క్లాస్ పనితీరు’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎస్టీని గబ్బర్సింగ్ ట్యాక్స్గా అభివర్ణించిన రాహుల్.. ఈరోజు నుంచి ఏయే వస్తువులపై పన్నులు విధించనున్నారోనన్న విషయంపై ఓ గ్రాఫ్ను షేర్ చేశారు.నిత్యావసర వస్తువులైన పెరుగు, పన్నీర్, బియ్యం, గోధుమలు, బార్లీ, బెల్లం, తేనె, బటర్మిల్క్ వంటి వాటిపై గతంలో ఎలాంటి పన్నులు లేవని.. ఇప్పుడు 5% పన్నులు విధించారంటూ రాహుల్ పేర్కొన్నారు. అలాగే హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీని భారీగా పెంచారంటూ తెలిపారు.
అలాగే, రాహుల్కి వరుసకు సోదరుడు అయ్యే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ సైతం తన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోతుంటే, ఈ దశలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇకపై మధ్యతరగతి జేబులు మరింత ఖాళీ అవుతాయి. ముఖ్యంగా ఉపాధి లేక అద్దె ఇండ్లలో నివసిస్తున్న యువతపై ఇంకా భారం పడుతుంది. వాళ్లకు ఉపశమనం ఇవ్వాల్సింది పోయి, ఇంకా ఇబ్బంది పెడుతున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. తాను బీజేపీకి చెందినవాడ్ని అయినప్పటికీ, ప్రజా సమస్యలపై మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. ఇప్పుడు జీఎస్టీపై ట్వీట్లు వేయడం సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది.
HIGH taxes, NO jobs
BJP’s masterclass on how to destroy what was once one of the world’s fastest growing economies. pic.twitter.com/cinP1o65lB
— Rahul Gandhi (@RahulGandhi) July 18, 2022