Rahul Gandhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభలో సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా ఆదేశాల మేరకే పోలీసులు విద్యార్థులపై కాల్పులు జరిపారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, రాహుల్ గాంధీ వాదనలు అబద్ధమని బీజేపీ తిప్పికొట్టింది.
ఇదిలా ఉంటే, పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. సభలో తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశాన్ని తనకు నిరాకరించారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడినైన తనను మాట్లాడనివ్వలేదని, సమస్యలు లేవనెత్తడం తన హక్కు అని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు లేవనెత్తడానికి ప్రయత్నించగా, తన ప్రసంగాన్ని పూర్తి చేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
మీడియా సమావేశంలో 5 ఫోటోలను చూపిస్తూ, పార్లమెంట్కు 500 మీటర్ల దూరంలో భారతీయ యువతపై దాడి జరిగిందని, విద్యార్థులపై జరిగిన చర్యల గురించి తాము హోంమంత్రికి నిరంతరం సమాచారం అందించామని, అమిత్ షా పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడుతుండటం నేను స్వయంగా చూశాను అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హోం మంత్రికి ఈ విషయం తెలియకపోతే అది చాలా తీవ్రమైన విషయమని, ఒకవేళ తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

