Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనంతరం బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చద్దాతో పాటు మరో ఇద్దరు ఎంపీలు మొత్తంగా ముగ్గురు ఎంపీలు ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిఠల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ తన సూత్రాల నుంచి పక్కకు తప్పుకుందని, మూడింట రెండు వంతు ఎంపీలతో బీజేపీలో చేరుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ, బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Read Also: Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా రాజీనామా.. బీజేపీలో చేరిక..
రాజ్యసభలో ఆప్కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 మంది బీజేపీలో విలీనం కానున్నారు. బీజేపీలో విలీనం అవుతున్న వారిలో హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ వంటి వారు ఉన్నారు. నా జీవితంలో 15 ఏళ్లుగా ఆప్కు సేవ చేశానని, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశానని, ఇప్పుడు ఆప్ వాటికి దూరమైందంటూ చద్దా విమర్శించారు. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి, ప్రజలకు చేరువవుతున్నట్లు వెల్లడించారు.
ఇటీవల పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ చద్దాను తొలగించింది. దీంతో పార్టీకి ఆయనకు మధ్య తీవ్ర దూరం ఏర్పడింది. ఢిల్లీ మాజీ సీఎం అతిశీ మాట్లాడుతూ.. బీజేపీలో చేరేందుకు రాఘవ్ చద్దా సిద్ధమయ్యారని, అందుకే పార్టీ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నట్లు ఆరోపించారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. చివరకు ఈ ఆరోపణలే నిజమయ్యాయి.
