Site icon NTV Telugu

సిద్ధూ పంతం నెగ్గింది.. ప్రతిష్టంభన ముగిసింది..!

పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఒకటి తర్వాత మరోటి అన్నట్టు కొత్త కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి.. నవజ్యోత్‌ సింగ్‌, సీఎంగా ఉన్న కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మధ్య వివాదాలతో.. చివరకు అమరీందర్‌ పార్టీని కూడా వీడి వెళ్లిపోగా.. కాంగ్రెస్‌ అధిష్టానం నియమించిన కొత్త సీఎం చరణ్‌జిత్‌ చన్నీతో కూడా సిద్ధూకు పొసగని పరిస్థితి వచ్చింది.. అయితే, ఈ పరిణామంలో మాత్రం తన పంతాన్ని నెగ్గించుకున్నారు ఈ మాజీ క్రికెటర్‌.. సిద్ధూ డిమాండ్లకు ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ చన్నీ దిగివచ్చారు.. అడ్వకేట్ జనరల్ రాజీనామాను ఆమోదించాలని పంజాబ్‌ కేబినెట్ నిర్ణయించింది. అలాగే కొత్త డీజీపీని నియమించాలనే నిర్ణయాన్ని ప్రకటించడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో ప్రతిష్టంభన ముగిసినట్టే అంటున్నారు విశ్లేషకులు.

Read Also: ఒడిశా సీఎంకు ధన్యవాదాలు తెలిపిన ఏపీ సీఎం..

ఇక, ఈ పరిణామాలపై స్పందించిన సీఎం చరణ్‌జిత్ చున్నీ.. ఏజీ కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు.. ఇవాళ ఆ రాజీనామాకు కేబినెట్ ఆమోదించిందని తెలియజేశారు.. గవర్నర్ ఆమోదం కోసం పంపుతున్నాం.. ఆమోదం పొందగానే కొత్త ఏజీని నియమించనున్నట్టు వెల్లడించారు.. మరోవైపు డీజీపీ పోస్టుకు చట్టప్రకారం 30 ఏళ్ల సర్వీసు ఉన్నవారి ప్యానెల్‌కు పంపి.. కొత్త డీజీపీని కూడా నియమిస్తామని తెలిపారు. అయితే, అడ్వకేట్‌ జనరల్‌ పదవికి ఏపీఎస్‌ డియోల్‌, డీజీపీగా ఇక్బాల్‌ ప్రీత్‌సింగ్‌ సహోటా రాజీనామా చేసే వరకు పీసీసీ బాధ్యతలు స్వీకరించబోనంటూ పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్న సిద్ధూ పట్టుబట్టిన సంగతి తెలిసిందే.. మొత్తంగా ఈసారి కూడా పంతం నెగ్గించుకున్నారు సిద్ధూ..

Exit mobile version