పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్ చిక్కుల్లో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ అత్యాచార కేసును మాఫీ చేసేందుకు గుర్ప్రీత్ కౌర్ రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది. సీరియస్గా తీసుకున్న కమిషన్.. ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఆరోపణలను రిటైర్డ్ పంజాబ్ న్యాయమూర్తి జస్టిస్ రంజిత్ సింగ్ బహిరంగంగా చేసినట్లు పేర్కొంటూ లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. అత్యాచారం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి భార్య పేరును ప్రస్తావిస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు రిటైర్డ్ న్యాయమూర్తి చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై స్వతంత్రంగా నిజానిజాలను నిర్ధారించాలని, ఆధారాలను భద్రపరచాలని, దర్యాప్తును ప్రభావితం చేయడానికి లేదా నీరుగార్చడానికి ఏదైనా ప్రయత్నం జరిగిందా అనే అంశంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారు కోరారు. బాధితురాలికి న్యాయం అందడం వ్యక్తుల హోదా, పలుకుబడి లేదా అధికారానికి అతీతంగా ఉండాలని ఎల్ఆర్వో (LRO) పేర్కొంది. ఈ ఆరోపణలు ప్రాథమికంగా బాధితురాలి మానవ హక్కులను ఉల్లంఘించే అంశంగా కనిపిస్తున్నాయని ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనూంగో నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలి
ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేయాలని ఎన్హెచ్ఆర్సీ రిజిస్ట్రీని ఆదేశించింది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై విచారణ జరిపి రెండు వారాల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను కమిషన్ పరిశీలనకు సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలను న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మహిళా భద్రత విభాగం జాయింట్ సెక్రటరీకి కూడా పంపాలని కమిషన్ సూచించింది. ప్రస్తుతం ఇవి ఫిర్యాదులో చేసిన ఆరోపణలు మాత్రమే. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాల మేరకు జరిగే విచారణలో ఆరోపణల వాస్తవికత తేలాల్సి ఉంది.

