వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది. ఆమెపై వచ్చిన ఆరోపణలపై విచారణ తర్వాత యూపీఎస్పీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆమె భవిష్యత్ అంధకారమైంది. ఐఏఎస్ ఉద్యోగం వచ్చాక వివేకంగా ప్రవర్తించకుండా.. గొంతెమ్మ కోర్కెలు కోరి.. లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుని ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్యూరోక్రట్గా ఈమె చరిత్రలో నిలిచిపోతుంది.
ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేద్కర్ ఎంపిక రద్దు చేస్తూ బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్ణయం తీసుకుంది. ఆమె పరీక్షకు హాజరైన ప్రతిసారి నకిలీ పత్రాలు సృష్టించి హాజరైనట్లుగా గుర్తించింది. ఆమె పేరుతో పాటు.. తల్లిదండ్రుల పేర్లు కూడా పలుమార్లు మార్చేసినట్లుగా తేల్చింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్లో కూడా ఎలాంటి పరీక్షలు రాయకుండా నిషేధం విధించింది.
ఆమెపై వచ్చిన ఆరోపణలపై యూపీఎస్సీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 30 వరకు సమయం ఇచ్చింది. గడువులోగా వివరణ ఇవ్వాలని నోటీసులు పేర్కొంది. కానీ ఆమె ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది.