ఉత్తరప్రదేశ్లోని ‘కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు’ ను సోమవారం ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగా ఘాట్లతో ఈ ప్రాజెక్టు అనుసంధానం చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్యకాశీ-భవ్యకాశీగా నామకరణం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా నగరం మొత్తాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు, వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. స్థానికుల నుంచి భూసేకరణ జరిపి, మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కారిడార్ను పూర్తి చేశారు. అలాగే 40 పురాతన ఆలయాలను పునరుద్ధరించి, సుందరీకరించారు. కొవిడ్ మహమ్మారి వెంటాడినా నిర్దేశిత సమయంలోనే కారిడార్ ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
సోమవారం ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ అగ్రనేతలకు ఆహ్వానం పంపారు. కార్యక్రమానికి 3వేల మంది సాధువులు, ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలకు యూపీ సర్కారు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. దేశ వ్యాప్తంగా దివ్యకాశీ-భవ్యకాశీని 51వేల చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈలోపే ప్రాజెక్టును ప్రారంభించి, విపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలని బీజేపీ భావిస్తోంది.