రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల కదనరంగంలోకి దిగారు. ఈనెల 30న జరగనున్న బంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీకి దిగారు. ఆదివారమే తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఈ ఉపఎన్నిక ప్రస్తుతం రసవత్తరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ నేరుగా ఇప్పుడు రంగంలోకి దిగారు.
సోమవారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంకీపూర్ ఉపఎన్నికలో తన పోటీని తేలికగా తీసుకుంటూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ప్రజల పట్ల అహంకారాన్ని చూపిస్తున్నాయని అన్నారు. బీజేపీకి ఈ అహంకారానికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ‘‘నేను బాంకీపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత బీజేపీ నాయకులను ఇది ఎంత పెద్ద సవాలో అని అడిగితే.. బంకీపూర్ తమకు అంత బలమైన కోట అని, అక్కడ కుక్కను లేదా పిల్లిని అభ్యర్థిగా నిలబెట్టినా ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని అన్నారు. ఇది ఆత్మవిశ్వాసం కాదు.. ప్రజల పట్ల అహంకారం’’ అని విమర్శించారు. అంతేకాకుండా బీహార్లోని చైతన్యవంతులు, చదువుకున్న, అభివృద్ధి కోరుకునే ఓటర్ల గురించి బీజేపీ ఇలాంటి అభిప్రాయం కలిగి ఉంటే.. సాధారణ ప్రజల గురించి వారు ఎలా ఆలోచిస్తున్నారో ఊహించవచ్చన్నారు. ‘‘ఈ అహంకారానికి వ్యతిరేకంగానే ప్రజలు ఓటు వేస్తారు’’ అని స్పష్టం చేశారు.
బంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ ఆదివారం అధికారికంగా పోటీ ప్రకటించారు. ఈ స్థానం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంతో ఖాళీ అయింది. 2006 నుంచి బంకీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నితిన్ నబిన్ ఏప్రిల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి జూలై 30న ఉపఎన్నిక జరగనుంది. బంకీపూర్ను బీజేపీకి సంప్రదాయ బలమైన నియోజకవర్గంగా భావిస్తారు.
ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నిక కేవలం ఎమ్మెల్యేను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదని, బీహార్లో కొత్త రాజకీయ వ్యవస్థకు నాంది పలికే ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) అని పేర్కొన్నారు. ‘‘ఇది ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా కూల్చివేయడం కోసం జరిగే ఎన్నిక కాదు. బీహార్లో కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టే అవకాశం. రాష్ట్రంలోని చైతన్యవంతమైన ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుని కొత్త రాజకీయాలకు దారి చూపుతారని నమ్ముతున్నాను’’ అని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ నుంచి పోటీ చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఈ నియోజకవర్గంలో బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించిన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల్లో ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ.. అప్పట్లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. జన్ సురాజ్ పార్టీకి సుమారు 3.34 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు బంకీపూర్ ఉపఎన్నిక ద్వారా ఆయన తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

