Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..

  • బంకీపూర్ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం..
  • ఈ గెలుపుతో ఆర్జేడీ, తేజస్వీ యాదవ్‌లకు కొత్త సవాల్..
  • ఆర్జేడీ సంప్రదాయ ముస్లిం, యాదవ ఓట్లకు గండి పడే ఛాన్స్..
Bihar

Bihar

Bihar Politics: ఎన్నికల వ్యూహాకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ కీలక విజయం సాధించారు. బీహార్‌లోని బంకీపూర్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అధికార బీజేపీ కూటమికి జన సురాజ్ పార్టీ గెలుపు షాక్‌ ఇచ్చింది. బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కమలానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే, రాజకీయ విశ్లేషకుల ప్రకారం, ఈ విజయం బీజేపీ కన్నా ప్రతిపక్ష ఆర్జేడీని తీవ్రంగా దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు.

ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌కు ఇది పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. ఆర్జేడీకి సంప్రదాయంగా వస్తున్న యాదవ, ముస్లిం ఓటు బ్యాంక్ జన సురాజ్ పార్టీకి మళ్లినట్లు కనిపిస్తోంది. ఇదే ధోరణి వచ్చే ఎన్నికల్లో కనిపిస్తే రానున్న రోజుల్లో బీజేపీ కన్నా ఆర్జేడీకే ఎక్కువ నష్టం చేసే అవకాశం ఉంది. మరోవైపు, ఈ ఎన్నికల్లో పట్టణ మధ్య తరగతి వర్గాల్లో కూడా ఆయనకు మద్దతు ఉంది. ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సమావేశాలకు, ర్యాలీలకు పెద్ద ఎత్తున యువత, ముస్లింలు, యాదవులు హాజరైనట్లు కనిపించింది.

చాలా ఏళ్లుగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ముస్లిం, యాదవ ఓటర్లపై ఆధారపడి రాజకీయ చేస్తోంది. ఇప్పుడు ఈ ఓటు బ్యాంకుకు ప్రశాంత్ కిషోర్ గండికొట్టేలా కనిపిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, వలసలు, అవినీతి, సుపరిపాలన వంటి అంశాలపై ప్రశాంత్ కిషోర్ నిరంతరం మాట్లాడుతున్నారు. కుల రాజకీయాలను ప్రశ్నిస్తూ యువతకు ప్రత్యామ్నాయ రాజకీయాల సందేశాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదటిసారి ఓటర్లను ప్రశాంత్ కిషోర్ ఆకర్షిస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్ స్వతహాగా మంచి వక్త. గణాంకాల ద్వారా ప్రజల్ని ఆకర్షించేలా చేస్తారు. తేజస్వీ యాదవ్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాన్ని నిలదీయడంతో ప్రశాంత్ కిషోర్ ప్రాధాన్యత పెరిగింది. ఇదే కొనసాగితే, బీహార్‌లో ప్రతిపక్ష పాత్రను జన్ సురాజ్ పార్టీ భవిష్యత్తులో చేజిక్కించుకునే అవకాశం లేకపోలేదు.