కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు విస్తృతంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తోంది భారత్.. ఇప్పటికే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 100 కోట్ల మార్క్ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే కాగా… వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ.. స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశం కానున్నారు.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న ఏడు వ్యాక్సిన్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ అవుతారు.. ఈ సమావేశానికి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, జైడస్ క్యాడిల్లా, బయోలాజికల్ ఈ, జెన్నోవా బయోఫార్మా, పనేసియా బయోటెక్ సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ, సహాయ మంత్రి భారతి ప్రవిన్ పవార్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు..
అయితే, ఇప్పటికే రెండు స్వదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం.. మరో మూడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా పర్మిషన్ ఇచ్చింది… ఇక, ఇవాళ భేటీకి మొత్తం ఏడు సంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరుకానుండడంతో.. మిగతా కంపెనీల వ్యాక్సిన్లకు సైతం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు.. పిల్లలకు వ్యాక్సిన్ కోసం ఇప్పటికే విధివిధానాలును రూపొందించింది భారత ప్రభుత్వం.. త్వరలోనే చిన్నారులకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం కాబోతోంది.
