Rahul Gandhi: సాగు చట్టాల తరహాలో అగ్నిపథ్‌నూ వెనక్కి తీసుకోవాల్సిందే..

Rahul

Rahul

సైనికుల నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత విధ్వంస చర్యలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ స్పందించారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం.. అదే తరహాలో అగ్నిపథ్‌ స్కీమ్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

‘‘వరుసగా 8 ఏళ్ల నుంచి భాజపా ప్రభుత్వం ‘జై జవాన్‌, జై కిసాన్‌’ విలువలను అవమానపరిచింది. నల్ల వ్యవసాయ చట్టాలను ప్రధానమంత్రి రద్దు చేసుకోకతప్పదని నేను గతంలో చెప్పాను. అదే తరహాలో తాజాగా ఆయన దేశ యువత నిర్ణయాన్నీ అంగీకరించాల్సిందే. క్షమాపణలు చెప్పి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అగ్నిపథ్‌లో చేరుతున్నవారిని ‘అగ్నివీర్‌’లని వ్యవహరిస్తున్నట్లుగా .. యువతకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసిన రాహుల్‌ ఆయనను వ్యగ్యంగా ‘మాఫీవీర్‌’ అని సంబోధించారు.

సైన్యంలో కొత్తగా ప్రవేశపెట్టిన తాత్కాలిక నియామక విధానం ‘అగ్నిపథ్‌’పై నిరసనలు శుక్రవారం మరిన్ని రాష్ట్రాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. యువకుల ఆగ్రహంతో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. నిరసనకారులు పోలీసులతోనూ బాహాబాహీకి దిగారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌తోపాటు సైనిక ఉద్యోగార్థులు పలు రాష్ట్రాల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పంటించారు. రహదారులపై, రైలు మార్గాల్లో బైఠాయించారు. ప్రభుత్వ ఆస్తులపై రాళ్ల దాడులకూ పాల్పడ్డారు. బిహార్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రైలు సర్వీసులు నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Agnipath Scheme: సికింద్రాబాద్ విధ్వంసం వెనుక పీకే..! డీకే అరుణ సంచలన ఆరోపణ