PM Modi Telangana Visit: తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఆదివారం హెచ్ఐసీసీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొని, రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగానికి సంబంధించిన భారీ వరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సుమారు రూ.9,377 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కాకతీయ టెక్స్టైల్స్ పార్క్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. గుడెబల్లూర్ – మహబూబ్నగర్ 4 లేన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్గా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం తెలంగాణ పురోగతిపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయమైనది. దేశాభివృద్ధిలో నగరం కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. వరంగల్ పీఎం మిత్ర పార్కు ద్వారా దేశంలో టెక్స్టైల్స్ రంగానికి ఊతమిస్తుంది. ఇది దేశీయ వస్త్ర రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తుంది. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టుల కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తున్నాం. తెలంగాణలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయి. 2014 ముందు ఏపీకి వెయ్యి కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేది. ఇప్పుడు బడ్జెట్లో తెలంగాణకే రూ.5,500 కోట్లు రైల్వే పనులకు కేటాయించాం. రూ.15 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయి. తెలంగాణకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు, నేను కూడా మాట్లాడను. పదేళ్లలో గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు.
