PM Modi Paper Leak Law: పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం

  • పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం
  • ప్రధాని మోడీ అర్ధరాత్రి వీడియో సందేశం
  • విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం
Pm Modi

Pm Modi

PM Modi Paper Leak Law: దేశవ్యాప్తంగా పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు మరింత కఠినమైన చట్టాలను తీసుకురావడంతో పాటు ప్రత్యేక సంస్కరణలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం జరిగే ప్రత్యేక కేంద్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కొత్త బిల్లును ప్రవేశపెడతామని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి గురువారం రాత్రి విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మాట్లాడుతూ, పేపర్ లీక్ అనేది సాధారణ విషయం కాదని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అత్యంత కీలక అంశమని పేర్కొన్నారు.

విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం

“పేపర్ లీక్ వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపాం. అభ్యర్థుల ఒక విద్యా సంవత్సరం వృథా కాకూడదనే ఉద్దేశంతో 22 లక్షల మంది అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాం. జూలై 19న ఫలితాలను కూడా విడుదల చేశాం” అని ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా, పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటు, కొత్త చట్టంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

పార్లమెంట్‌లో కొత్త బిల్లు

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల రెండో వారంలో ఈ అంశంపై కొత్త బిల్లును ప్రవేశపెట్టి, దానిని ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్-ట్రాక్ కోర్టులు

పేపర్ లీక్ కేసులపై త్వరితగతిన విచారణ జరిపి, నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు దేశవ్యాప్తంగా ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రధాని హెచ్చరించారు.

ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

ప్రధాని ప్రకటన అనంతరం ఢిల్లీ హైకోర్టు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్‌లు, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించేందుకు జడ్జి అనూ గ్రోవర్ బాలిగాను ప్రత్యేక ఫాస్ట్-ట్రాక్ కోర్టు న్యాయమూర్తిగా నియమించింది.

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బదిలీ

పేపర్ లీక్ వివాదం మధ్య కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ ను నియమించింది. 1994 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన గంగ్వార్, ఇప్పటివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. అలాగే పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా సేవలందించారు.

దేశవ్యాప్తంగా నిరసనలు

ఇటీవలి కాలంలో వివిధ పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ ఘటనలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన సంస్కరణలు, వేగవంతమైన విచారణ వ్యవస్థ, కఠిన శిక్షల ద్వారా పరీక్షల పారదర్శకతను కాపాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.