PM-Kisan: దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan) యోజన 23వ విడత నిధుల విడుదల తేదీని కేంద్ర సర్కార్ అధికారికంగా ఖరారు చేసింది. వచ్చే జూన్ 20న (ఈ వారంలోనే) దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9 కోట్లకు పైగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా రూ.2,000 చొప్పున నగదు జమ కానుంది. అయితే ఈ నిధులు అందుకోవాలంటే రైతులు ఒక ముఖ్యమైన పనిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.6,000 సహాయం..
రైతులకు పెట్టుబడి సాయం అందించి, వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ పథకాన్ని స్టార్ట్ చేసింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000లను నేరుగా వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తోంది. విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల వంటి వ్యవసాయ అవసరాలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయి. గత మార్చి 13న ప్రభుత్వం 22వ విడత కింద రూ.18,640 కోట్లను సుమారు 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసిన సంగతి తెలిసిందే.
ఇ-కేవైసీ (e-KYC) లేకపోతే పైసలు రావు..
23వ విడత లబ్ధి పొందడానికి రైతులు తప్పనిసరిగా ఇ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇ-కేవైసీ అసంపూర్తిగా ఉంటే, సదరు రైతుల ఖాతాలకు ఈ విడత నిధులు బదిలీ కావని స్పష్టం చేసింది. మోసపూరిత లబ్ధిదారులను ఏరివేసి, కేవలం అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను కఠినతరం చేసింది.
ఆన్లైన్లో e-KYC ఇలా పూర్తి చేయండి ..
రైతులు జూన్ 20 లోపు తమ మొబైల్ లేదా సిస్టమ్ ద్వారా ఇంట్లోనే కూర్చొని ఈ క్రింది పద్ధతిలో ఇ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు..
* మొదట పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
* తర్వాత హోమ్పేజీలో కుడివైపున కనిపించే “e-KYC” ఆప్షన్పై క్లిక్ చేయాలి.
* అక్కడ మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయాలి.
* తర్వాత మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే OTPని ఎంటర్ చేయాలి.
* వివరాలు ధృవీకరించిన తర్వాత, మీ ఇ-కేవైసీ ప్రక్రియ సక్సెస్ అవుతుంది.
ఒకవేళ మీ మొబైల్ నంబర్కు OTP రాకపోతే.. వెంటనే సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా జన్ సేవా కేంద్రాన్ని సందర్శించి, బయోమెట్రిక్ (వేలిముద్ర) ద్వారా మీ ఇ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు.
మీ e-KYC స్టేటస్ ఎలా తనిఖీ చేసుకోవాలంటే..
మీ ఇ-కేవైసీ ఇప్పటికే పూర్తయిందో లేదో తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
* పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
* అక్కడ “Know Your Status” పై క్లిక్ చేయండి.
* మీ రిజిస్ట్రేషన్ నంబర్, స్క్రీన్పై ఉన్న క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి.
* వెంటనే మీ స్క్రీన్పై ఇ-కేవైసీ స్టేటస్ యాక్టివ్గా ఉందో లేదో చూపిస్తుంది.
కాబట్టి, లబ్ధిదారులైన రైతులందరూ జూన్ 20 లోపే తమ ఇ-కేవైసీ స్టేటస్ చెక్ చేసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా రూ.2,000 అకౌంట్లలో పడేలా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Direct support, stronger farmers!
Mark the date: 23rd instalment of PM-KISAN is set to be released on 20th June 2026, bringing continued financial strength directly to the accounts of our Annadatas.#PMKISAN #23rdinstallment pic.twitter.com/W9QtUiTyFk
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) June 15, 2026

