Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?

  • ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ భేటీ
  • పార్లమెంట్ సమావేశాల్లో వ్యూహాంపై చర్చ
  • డీలిమిటేషన్‌తో పాటు కీలక బిల్లులు అడ్డుకోవాలని నిర్ణయం
Cwc

Cwc

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత జరుగుతున్న సమావేశాలు కాబట్టి ఈసారి హాట్‌హాట్‌గా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేసింది. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, విద్యా వ్యవస్థలో అవ్యవస్థలు, అవినీతి, ధరల పెరుగుదల, విదేశాంగ వైఫల్యాలు వంటి కీలక అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది. అలాగే నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్), మంత్రులు-ముఖ్యమంత్రుల తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.

జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసం 10 జనపథ్‌లో కీలక వ్యూహ సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కేసీ. వేణుగోపాల్, జైరాం రమేష్, పి.చిదంబరం, శశి థరూర్, మనీష్ తివారీ, కుమారి సెల్జా, తారిక్ అన్వర్ తదితర సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం ఎక్స్ వేదికగా స్పందించిన మల్లికార్జున ఖర్గే.. రామ మందిర విరాళాల దుర్వినియోగం, ప్రశ్నాపత్రాల లీకులు, విద్యా వ్యవస్థలో క్షీణత, రాజ్యాంగ సంస్థల బలహీనత, రాజకీయ పార్టీల విభజన, అవినీతి, ధరల పెరుగుదల, విదేశాంగ వైఫల్యాలు, ఎథనాల్ మిశ్రమ ఇంధన విధానం, అటవీ నరికివేత, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల హక్కులపై దాడులు వంటి అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకం

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీలిమిటేషన్ బిల్లును మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 17న ప్రభుత్వం రెండు మూడవ వంతు మెజారిటీ సాధించడంలో విఫలమైందని, ఇప్పుడు మరోసారి అదే బిల్లును తీసుకురావాలని చూస్తోందన్నారు. డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ గతంలో ఎలా వ్యతిరేకించిందో ఇప్పటికీ అదే వైఖరి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే 30 రోజుల పాటు జైలులో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు.

‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ అంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)పై కూడా సమావేశంలో చర్చ జరిగినట్లు జైరాం రమేష్ తెలిపారు. అలాగే వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు, జాతీయ ఆహార భద్రత చట్టం-2013 సవరణలు వంటి బిల్లులను కూడా కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానున్న శాసనసభ్య కార్యక్రమాల్లో కాంగ్రెస్ మద్దతు ఇవ్వగల బిల్లు ఏదీ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్‌ను ప్రస్తుత లోక్‌సభ స్థానాల సంఖ్య ఆధారంగానే అమలు చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తుందని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

అమిత్ షా రాజకీయ పార్టీలను చీల్చి రెండు మూడవ వంతు మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన.. అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అవమానమని విమర్శించారు. అయితే బీజేపీకి లోక్‌సభలో రెండు మూడవ వంతు మెజారిటీ సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు.

ఇండియా కూటమి వ్యూహ సమావేశం

పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇండియా కూటమి సోమవారం వ్యూహ సమావేశం నిర్వహించనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదివారం అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై చర్చించనుంది.

జూలై 20 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల తొలగింపుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులతో పాటు పలు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు నీట్ ప్రశ్నాపత్రాల లీక్, రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు, పెరుగుతున్న చమురు ధరలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.