Parliament Monsoon Session: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు మొత్తం 19 రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒకవైపు అధికార ఎన్డీఏ ప్రభుత్వం కీలక బిల్లులను ఆమోదింపజేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై నిలదీయడానికి వ్యూహరచన చేసింది. దీంతో ఉభయసభల్లో తీవ్ర వాగ్వాదాలు, నిరసనలు, గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
సమావేశాల ప్రారంభానికి ముందు ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవనంలో ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహం, సమన్వయం, ప్రభుత్వంపై చేపట్టాల్సిన ఉమ్మడి పోరాట కార్యాచరణను ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు ఖరారు చేయనున్నారు. అయోధ్య రామమందిరం విరాళాల వ్యవహారం, నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనలు వంటి అంశాలను సభలో బలంగా ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. అలాగే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
ఇటీవల పలు రాజకీయ పార్టీల్లో చోటుచేసుకున్న పరిణామాలు కూడా ఈ సమావేశాల్లో ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన పలువురు ఎంపీలు కొత్త పార్టీలో చేరడం, కొందరు బీజేపీలోకి వెళ్లడం, అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరడం వంటి పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తూ ప్రతిపక్ష పార్టీల్లో చీలికలను అధికార పార్టీ ప్రోత్సహిస్తోందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మంగళవారం ఉదయం పార్లమెంట్లో జరిగే ఎన్డీఏ “మంగళ్-మిలన్” సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంపీలకు ప్రభుత్వ అజెండా, లక్ష్యాలను వివరించనున్నారు. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చట్టాలను ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

