Operation Sindoor: భారత దెబ్బకు రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..

  • భారత దెబ్బకు రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్..
  • ఆపరేషన్ సిందూర్‌లో దెబ్బతిన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌కి మరమ్మతులు..
Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో బదులు తీర్చుకుంది. అయితే, భారత్ ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేసినా, పాక్ ఆర్మీ కవ్వించిన సంగతి తెలిసిందే. పాక్ ఆర్మీ భారత జనావాసాలు, సైనిక స్థలాలను టార్గెట్ చేస్తూ, డ్రోన్లతో దాడులు నిర్వహించింది. దీనికి బదులుగా భారత్ పాకిస్తాన్‌లోని కీలకమైన పలు ఎయిర్ బేసులపై దాడులు చేసింది. పాకిస్తాన్ పలు ప్రావిన్సుల్లో ఉన్న ఎయిర్ బేసులు భారత దాడుల్లో ధ్వంసమయ్యాయి.

Read Also: UP Man Wins Lottery: 30 ఏళ్ల యువకుడికి రూ.34 కోట్ల బహుమానం.. దుబాయ్‌లో యూపీ యువకుడి అదృష్టం..

ప్రస్తుతం, దెబ్బతిన్న ఎయిర్ బేసులకు పాకిస్తాన్ రిపేర్లు చేసుకుంటోంది. పాక్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వద్ద పునర్నిర్మాణ పనులను ప్రారంభించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పాక్ ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన కీలకమైన ఆస్తుల్ని కలిగి ఉంది. మే 10న ఈ ఎయిర్ బేస్‌పై భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే, ఆ సమయంలో బ్రహ్మోస్‌తో దాడి జరిగిందని పాకిస్తాన్ చెప్పింది. భారత్ బ్రహ్మోస్ లేదా స్కాల్ప్ క్షిపణుల్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌పై భారత్ దాడి చాలా కీలకం, ఈ ఎయిర్ బేస్‌ని పాక్ సైన్యం స్ట్రాటజిక్ ఎస్సెట్‌గా చూస్తోంది. ఇక్కడ నుంచే పాక్ వాయు సేన ఆపరేషన్స్ నిర్వహిస్తుంటుంది. ఈ స్థావరంలోనే అవాక్స్, C-130 రవాణా విమానం, IL-78 మిడ్-ఎయిర్ లో ఇంధనం నింపే విమానాలు ఉన్నాయి. ఇవి లాజిస్టిక్, నిఘా, ఆపరేషన్ సమన్వయానికి ఉపయోగపడుతాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం ఆపరేషన్ సిందూర్‌లోనే పెద్ద ఎత్తున దెబ్బతింది.