Maharashtra Politics: పశ్చిమ బెంగాల్కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) తిరుగుబాటు ఎంపీలు సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కానుండటం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే, ఈ భేటీ తర్వాత జరిగే పరిణామాలను బట్టి మహారాష్ట్రలోని శివసేన (UBT), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP) ఎంపీలు కూడా తమ తదుపరి రాజకీయ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఉద్ధవ్కి ‘ఆపరేషన్ టైగర్’ భయం
దీదీ పార్టీలో మొదలైన తిరుగుబాటు తమ పార్టీకి ఎక్కడ సెగ తగులుతుందోనని శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాక్రే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన సోమవారం తన నివాసమైన ‘మాతోశ్రీ’లో అత్యవసరంగా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీల మనోగతాన్ని తెలుసుకుని, పార్టీలో వలసలను అడ్డుకోవడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అని సమాచారం. గత కొన్ని రోజులుగా ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 9 మంది ఎంపీలలో ఏకంగా 7 గురు ఎంపీలు పార్టీని వీడి, డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే వైపు వెళ్లేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ రాజకీయ వ్యూహానికి ‘ఆపరేషన్ టైగర్’ అని పేరు పెట్టారు. ఇటీవల ఏకనాథ్ షిండే ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఎంపీలు ఆయనను రహస్యంగా కలిసినట్లు సమాచారం. ముంబైకి చెందిన అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్ మినహా మిగిలిన ఎంపీలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పక్షంలో చేరాలని గట్టిగా భావిస్తున్నారట.
శరద్ పవార్ పార్టీ కూడా ఖాళీ
మరోవైపు సీనియర్ నేత శరద్ పవార్కు చెందిన ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) లోనూ ఇదే తరహా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎంపీలలో అత్యధికులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీలో పెద్ద ఎత్తున జరగబోయే ఈ వలసలను ఆపడానికి శరద్ పవార్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనపై శరద్ పవార్ గానీ, ఆయన కుమార్తె సుప్రియా సూలే గానీ ఇప్పటి వరకు ఎలాంటి ఖండన ఇవ్వకపోవడం విశేషం. సంజయ్ రౌత్ చేసిన విలీన వ్యాఖ్యలపై సుప్రియా సూలే స్పందిస్తూ.. “అది మంచి సూచనే, కానీ అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు” అని వ్యాఖ్యానించడం గమనార్హం. శరద్ పవార్ తన సెక్యులర్ భావజాలం కారణంగా బీజేపీ లేదా ఎన్డీయే (NDA) కూటమిలోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కానీ, ఆయన పార్టీలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం అధికారానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారని సమాచారం.
అజిత్ పవార్ మరణం.. మారిన సమీకరణాలు
గతంలో శరద్ పవార్ గ్రూప్ అంతా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో విలీనం అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, ఈ ఏడాది (2026) జనవరి 28న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ప్రస్తుతం పవార్ కుటుంబంలో విభేదాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో సునేత్రా పవార్, సుప్రియా సూలేలు మళ్లీ విలీన చర్చలు జరిపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాంగ్రెస్లోకి వెళ్లడం కంటే, కేంద్ర – రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న సునేత్రా పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలోకి వెళ్లడమే తమకు లాభదాయకమని శరద్ పవార్ వర్గంలోని మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఏది ఏమైనా, సోమవారం నాడు జరిగే పరిణామాలు అటు బెంగాల్తో పాటు ఇటు మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త భూకంపాన్ని సృష్టించబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

