Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత వైమానిక దళం సత్తా ప్రపంచానికి తెలిసొచ్చింది. ముఖ్యంగా పాకిస్తాన్కు భారత్ సైనిక పాటవాలు మరోసారి అర్థమయ్యాయి. గతేడాది మే 7న ఇండియన్ ఎయిర్ఫోస్(IAF) పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి కేవలం 22 నిమిషాల్లోనే మిషన్ పూర్తి చేసుకుని వచ్చినట్లు ఒక ఐఏఎఫ్ పైలట్ వెల్లడించారు. సుఖోయ్-30MKI యుద్ధ విమానాలు పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి లక్ష్యాలపై దాడులు నిర్వహించి సురక్షితంగా తిరిగి వచ్చినట్లు చెప్పారు.
భారత విమానాల దాడి, టార్గెట్లపై దాడి చేయడం, తిరుగు ప్రయాణం కోసం సుమారు 22 నిమిషాల కీలక సమయం లభించింది. ఈ వ్యవధిలో పాకిస్తాన్ వైమానిక దళం పూర్తిస్థాయిలో మోహరించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆధునిక వైమానిక పోరాటంలో రెస్పాన్స్ టైమ్ చాలా కీలకం. శత్రు దేశాల విమానాలను రాడార్లు గుర్తించడం, హెచ్చరికలు జారీ చేయడం, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థల నుంచి ఆదేశాలు ఇవ్వడం, అడ్డుకునే విమానాలు వేంగంగా గాల్లోకి టేకాఫ్ కావడం వేగంగా జరగాలి. ఇందులో ఎక్కడైనా జాప్యం జరిగిన విమానాలు తమ దాడుల్ని పూర్తి చేసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది.
అయితే, పాకిస్తాన్ వేగంగా స్పందించకపోవడానికి రాడార్ కవరేజ్ పరిమితులు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలో ఆలస్యం కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. భారత్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, ఆకస్మిక దాడి ద్వారా పాకిస్తాన్ వ్యవస్థలకు అంతరాయం కలిగి ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. దాడికి ఉపయోగించిన సుఖోయ్-30MKI భారత వైమానిక దళంలోని ప్రధాన మల్టీరోల్ ఫైటర్ జెట్లలో ఒకటి. దీర్ఘశ్రేణి ఆయుధాలు, అధునాతన ఏవియానిక్స్, రాడార్ వ్యవస్థలు, థ్రస్ట్ వెక్టరింగ్ వంటి సామర్థ్యాలు దీనికి ఉన్నాయి. ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ సర్ఫేస్ టార్గెట్లపై దాడులు చేయడం దీని సామర్థ్యం.

