Nurjahan Mango: భారతదేశాన్ని మామిడి పండ్ల రాజుగా అభివర్ణిస్తే.. ఆ సామ్రాజ్యానికి ‘మహారాజు’ లాంటిది మధ్యప్రదేశ్కు చెందిన ‘నూర్జహాన్’ మామిడి రకం. సాధారణ మామిడి పండ్లకు భిన్నంగా, భారీ పరిమాణం, అసాధారణ తీపి, సాటిలేని సువాసనతో ఈ మామిడి ప్రపంచవ్యాప్తంగా ‘లగ్జరీ మ్యాంగో’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్యం గల అలీరాజ్పూర్ జిల్లా, కట్టివాడ ప్రాంతంలో పండే ఈ నూర్జహాన్ మామిడి ప్రత్యేకతలు, దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
నూర్జహాన్ మామిడి ‘టాప్ 5’ ప్రత్యేకతలు ఇవే..
భారీ పరిమాణం – బరువు: సాధారణంగా మామిడి పండ్లు అంటే కొన్ని వందల గ్రాములే ఉంటాయి కదా.. కానీ ఈ నూర్జహాన్ మామిడి పండు మాత్రం ఏకంగా 2 నుంచి 5 కిలోగ్రాముల వరకు బరువు ఉంటుంది. ఒక్క పండు కొంటే ఒక పెద్ద కుటుంబం మొత్తం హాయిగా తినేయొచ్చు.
రాజరికపు ధర: మార్కెట్లో దీని డిమాండ్, ప్రత్యేకతను బట్టి ఒక్కో పండు ధర సుమారుగా రూ.1,500 నుంచి రూ.3,000 వరకు పలుకుతుంది.
అరుదైన ఉత్పత్తి: ఈ చెట్లకు పండ్లు చాలా పరిమితంగా కాస్తాయి. అందుకే ఇవి ఇంకా పండకముందే సంపన్న వ్యాపారవేత్తలు, మామిడి ప్రియులు అడ్వాన్స్ ఇచ్చి మరీ వాటిని బుక్ చేసుకుంటారు.
అద్భుతమైన రుచి: నూర్జహాన్ మామిడి గుజ్జు అత్యంత రసవంతంగా ఉంటుంది. ఇందులో పీచు చాలా తక్కువ. ఒక ప్రత్యేకమైన రాజసం ఉట్టిపడే సువాసన ఈ పండు సొంతం.
జాతీయ గౌరవం: ఈ మామిడి అసాధారణ గుర్తింపును గౌరవిస్తూ 1999 – 2010 సంవత్సరాలలో జాతీయ స్థాయిలో ఈ రకానికి ప్రత్యేక పురస్కారాలు, గౌరవం లభించాయి.
ఆఫ్ఘనిస్థాన్ టు కట్టివాడ.. దశాబ్దాల చరిత్ర
ఈ అరుదైన నూర్జహాన్ మామిడి మూలాలు ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతానికి చెందినవని నమ్ముతారు. దశాబ్దాల క్రితం భారతదేశానికి చేరిన ఈ రకం.. 1950, 1960ల కాలంలో మధ్యప్రదేశ్లోని మాల్వా, ఝబువా – అలీరాజ్పూర్ గిరిజన ప్రాంతాల్లో స్థిరపడింది. జునా కట్టివాడకు చెందిన శివ్ (బవడి) మామిడి తోటల రైతు భరత్రాజ్సింగ్ జాదవ్ తన కుటుంబ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ.. సుమారు 55 – 60 సంవత్సరాల క్రితం తన తండ్రి దివంగత రణ్వీర్సింగ్ జాదవ్ గుజరాత్లోని బన్మా ప్రాంతం నుంచి ఒక మొక్కను తెచ్చి ఇక్కడి నేలపై ఎంతో శ్రమతో నాటారని చెప్పారు. ఇప్పుడు అది ఆ ప్రాంతానికే ఒక ప్రత్యేక చిహ్నంగా మారిందని గర్వంగా పేర్కొన్నారు. ప్రస్తుతం జాదవ్ కుటుంబం అంటుకట్టే పద్ధతుల ద్వారా 25 ఏళ్ల నాటి ప్రధాన చెట్టుతో పాటు మరో 11 కొత్త మొక్కలను పెంచుతూ ఈ రాజరిక వారసత్వాన్ని కాపాడుతోంది.
గల్ఫ్ దేశాల నుంచి అమెరికా వరకు తిరుగులేని క్రేజ్
నూర్జహాన్ మామిడి ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల దీనిని వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున ఎగుమతి చేయలేకపోతున్నారు. అయినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో దీనికొక లగ్జరీ బ్రాండ్ ఇమేజ్ ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ వంటి దేశాల్లో దీని సైజ్, లుక్కు విపరీతమైన అభిమానులున్నారు. అలాగే అమెరికా, కెనడా, బ్రిటన్లలో స్థిరపడిన ఎన్నారైలతో పాటు సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లోని భారతీయుల నుంచి కూడా వీటికి భారీ ఆర్డర్లు వస్తుంటాయి.
ప్రభుత్వ ప్రోత్సాహం.. రైతులకు వరం
ఈ అమూల్యమైన కట్టివాడ వారసత్వాన్ని కాపాడేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యానవన శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. బిందు సేద్యం, ఆధునిక సాంకేతికతలు, పండ్ల శుద్ధి పద్ధతుల ద్వారా దీని ఉత్పత్తిని పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తోంది. నేడు ‘నూర్జహాన్’ కేవలం ఒక పండు మాత్రమే కాదు.. అలీరాజ్పూర్ గిరిజన రైతుల ఆర్థిక శ్రేయస్సుకు, ప్రపంచ వేదికపై మధ్యప్రదేశ్ వ్యవసాయ రంగానికి ఒక గర్వకారణంగా నిలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
