Udhayanidhi Stalin: “ప్రధాని, ఈడీకి భయపడం”.. నీతి ఆయోగ్ మీటింగ్‌కి స్టాలిన్ హజరుపై ఉదయనిధి..

  • ‘‘ప్రధాని, ఈడీకి మేము భయపడం’’..
  • నీతి ఆయోగ్ సమావేశానికి స్టాలిన్ హజరుపై ఉదయనిధి..
  • ప్రతిపక్ష ఆరోపణల్ని తిప్పికొట్టిన జూనియర్ స్టాలిన్..
Udhayanidhi Stalin

Udhayanidhi Stalin

Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొనడంపై ప్రతిపక్షాల ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. డీఎంకే నాయకత్వం ఈడీ లేదా ప్రధాని మోడీకి భయపడదని అన్నారు. తమిళనాడు ప్రజలకు సరైన ఆర్థిక కేటాయింపులు సాధించాలనే ఆసక్తితోనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.

Read Also: Operation Sindoor: భారత్ దాడిలో పాకిస్తాన్‌కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..

‘‘రాష్ట్రానికి నిధులు కోరేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఎప్పటిలాగే, ప్రతిపక్షం ఈ విషయాన్ని రాజకీయం చేస్తోంది’’ అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే ఎడప్పాడి కే పళనిస్వామి వ్యాఖ్యలకు జూనియర్ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. గతంలో నీతి ఆయోగ్ సమావేశాలను బహిష్కరించడం వల్ల తమిళనాడు కీలకమైన నిధుల్ని కోల్పోయిందని, ముఖ్యంగా తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) పై ఇటీవల ED చర్య తీసుకున్న తర్వాత, కేంద్ర ఏజెన్సీ దాడుల భయంతోనే ఈ సంవత్సరం సమావేశానికి స్టాలిన్ హాజరయ్యారని పళనిస్వామి ఆరోపించారు.

పళనిస్వామి ఆరోపణలకు ఉదయనిధి స్పందిస్తూ..‘‘వారు మిమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నించారు. కానీ మేము లొంగిపోయే బానిస పార్టీ కాదు. ఈ పార్టీని కలైంజర్ సృష్టించారు. పెరియార్ భావజాలం ఉంది. దోషులు మాత్రమే భయపడాలి, మేము చట్టబద్ధంగా ప్రతీదాన్ని ఎదుర్కొంటాము’’ అని అన్నారు.