Ram Temple Event: అయోధ్యలో ఈ నెల 22న జరిగే రామాలయ ప్రారంభోత్సవానికి తాను హాజరుకాబోవడం లేదని గతంలో పూరీ శంకరాచార్య చెప్పారు. ఈ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని అన్నారు. రామాలయంపై రాజకీయం చేస్తున్నారని పూరీలోని గోవర్థన మఠం పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి తాను దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆయనతో జతకలిశారు ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి.
ఈ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావద్దని ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి కోరారు. సనాతన ధర్మ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం లేదని, తాను ధర్మశాస్త్రాలకు విరుద్ధంగా వెళ్లలేనని, అందుకే ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని చెబుతున్నారు. పూర్తిగా ఆలయాన్ని నిర్మించకుండానే ప్రాణప్రతిష్ట చేయడమేంటని ప్రశ్నించారు.
‘‘ప్రధాని నరేంద్రమోడీ గర్భగుడిలో ఉండీ విగ్రహాన్ని తాకుతారు. దీనికి రాజకీయ కోణం ఇస్తున్నారు. శ్రీరాముడి ప్రతిష్టాపనను గౌరవప్రదంగా చేయాలి. నేను దీన్ని వ్యతిరేకించను, హాజరుకాను’’ అని పూరి శంకరాచార్య అన్నారు. నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచానని, ప్రతిదీ సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: Congress Meeting: రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగింది..
ఈ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావద్దని ఉత్తరాఖండ్ జోతిష్ పీఠం శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి చెప్పారు. సనాతన నిబంధనలు ఉల్లంఘిస్తునందుకు హిందూ గురువులు ఈ కార్యక్రమానికి హాజరుకావడం లేదని ఆయన హరిద్వార్లో చెప్పారు. అయితే, ద్వారక, శృంగేరి మఠాలకు చెందిన పీఠాధిపతులు మాత్రం ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.
శంకరాచార్య అనేది హిందూ మతంలో అద్వైత వేదాంత సంప్రదాయంలో పేర్కొన్న మఠాధిపతులను సూచిస్తుంది. ఆదిశంకరాచార్యులు ఉత్తరాన బదరికాశ్రమ జ్యోతిష్ పీఠం, పశ్చిమాన ద్వారక శారదా పీఠం, తూర్పున పూరిలోని గోవర్ధన్ పీఠం, కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో శృంగేరి శారదా పీఠం వద్ద నాలుగు మఠాలను స్థాపించారని చెబుతారు.